అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందంతో....బాంబులు, తుపాకుల మోతతో 18 ఏండ్లుగా దద్దరిల్లుతున్న ఆఫ్ఘనిస్థాన్లో త్వరలో శాంతి నెలకొననుంది. చారిత్రాత్మక ఒప్పందం ఆఫ్ఘనిస్థాన్లో శాంతి వీచికలపై కొత్త ఆశలు చిగురింపజేయగా, అక్కడి మహిళల్లో మాత్రం భయాందోళనలను రేకెత్తిస్తోంది. ఒప్పందం మేరకు అమెరికా సేనలు ఆఫ్ఘన్ను వీడనున్న నేపథ్యంలో దేశంలో మళ్లీ తాలిబన్లు రాజ్యమేలుతారన్న ఆందోళన వారిలో నెలకొందని అంటున్నారు.
అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఆఫ్ఘనిస్థాన్లో శాంతి వీచికలపై కొత్త ఆశలు చిగురింపజేయగా, అక్కడి మహిళల్లో మాత్రం భయాందోళనలను రేకెత్తిస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్లో చాలా ప్రాంతాలు తాలిబన్ల నియంత్రణలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బాలికలను ప్రాథమిక పాఠశాలల్లోకి అనుమతిస్తున్నా.. మహిళలపై కొరడా ఝళిపించడం, బహిరంగంగా రాళ్లు విసరడం వంటి ఘటనలు జరుగుతుండడంతో తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వస్తే పాత కథే పునరావృతమవుతుందనే భయం వెంటాడుతున్నది. ఒప్పందం మేరకు అమెరికా సేనలు ఆఫ్ఘన్ను వీడనున్న నేపథ్యంలో దేశంలో మళ్లీ తాలిబన్లు రాజ్యమేలుతారన్న ఆందోళన వారిలో నెలకొన్నది. పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోతామని మహిళలు ఆందోళన చెందుతున్నారు. శాంతి పవనాలను ఆస్వాదించేందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందేమోనన్న అనుమానం వారి మెదళ్లను తొలుస్తోందని అంటున్నారు.
తాలిబన్ పాలనను చూసిన వారు ... వారు వస్తే ఆ చీకటి, బాధాకర జ్ఞాపకాలను తిరిగి తేవడం తప్ప మరేమీ జరుగదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకుంటున్నారని, అయితే తాలిబన్ల పునరాగమనాన్ని కాదని చెప్తున్నారు. ఈ శాంతి తమకొద్దు అని పేర్కొంటున్నారు. అయితే తాలిబన్కు పుట్టినిల్లయిన కాందహార్కు చెందిన విద్యార్థిని పర్వానా హుస్సేనీ (17) స్పందిస్తూ.. ‘నేనేమీ ఆందోళన చెందడం లేదు. తాలిబన్లు ఎవరు? వాళ్లు మా సోదరులు. మేమంతా ఆప్ఘన్ ప్రజలం. మేం శాంతి కోరుకుంటున్నాం. యువతరం మారింది. తాలిబన్లు వారి సిద్ధాంతాలను తమపై రుద్దడాన్ని యువత ఒప్పుకోదు’ అని ఆమె అభిప్రాయపడ్డారు.