ప్రధాని నరేంద్ర మోడీ.. అందరు లీడర్లలా కాదు. ఆయన టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. అసలు సోషల్ మీడియాను ఆయన వాడినంత పకడ్బందీగా ఎవరూ వాడి ఉండరు. అలాగే సోషల్ మీడియా నుంచి ఆయన పొందినంత లాభం కూడా ఎవరూ పొంది ఉండరు. అలాంటి నరేంద్ర మోడీ ఇప్పుడు నెటిజన్లకు షాక్ ఇచ్చారు.
సోషల్ మీడియా విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయమే తీసుకున్నారు. సోషల్ మీడియా నుంచి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయనే ఈ విషయం ట్వీట్ చేయడంతో ఇది వైరల్ అవుతోంది. ఈ ఆదివారం నుంచి ట్విటర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా అన్నింటి నుంచీ వైదొలగాలని ఆలోచిస్తున్నా. ఏ విషయమూ మీకు తెలియపరుస్తా.. అని తన ట్వీట్లో ఆయన తెలిపారు.
అయితే ఆయన ఎందుకు ఇంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం తెలియడం లేదు. ఆయన కూడా ఈ నిర్ణయానికి కారణాలను తెలియచేయలేదు. 2009లోనే సోషల్ మీడియాలో చేరిన మోదీ ఆ మాధ్యమాల్లో పెద్ద సెలబ్రిటీగా మారారు. ఆయనకు ట్విటర్లో 5.33 కోట్లు, ఫేస్బుక్లో 4.4 కోట్లు, ఇన్స్టాలో 3.52 కోట్లు, యూట్యూబ్లో నలభై ఐదు లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.
అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ బాగా ఎక్కువయ్యాయి. మరి మోడీ ఇంత సంచలన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటన్నది మాత్రం అంతుబట్టకుండా ఉంది. ఫేక్ న్యూస్ కు ప్రాధాన్యం వస్తోందన్న అభిప్రాయంతోనే ఆయన వైదొలగాలనుకుంటున్నారన్న వాదన ఉంది. కానీ. అలాంటి సమస్యలు ఉంటే.. టెక్నికల్ గా వాటికి ఎలా అడ్డుకట్ట వేయాలో ఆలోచించాల్సిన మోడీ.. ఇలాంటి పని చేస్తారా.. ఏమో చూడాలి.