ఇండియాలో రాదేమో అనుకున్న కరోనా ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చింది. కరోనా విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అన్ని రాష్ట్రాలు ప్రజలకు మార్గదర్శకాలు రిలీజ్ చేస్తున్నాయి. హైదరాబాద్ లో ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో అలర్ట్ అయ్యింది. మేజర్ హాస్పిటల్స్ లో ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేసింది. ఇక గాంధీలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యింది. జగన్ ప్రభుత్వం దీనిపై సమీక్ష నిర్వహించింది. మంత్రులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఇక ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ప్రజలను అలర్ట్ చేస్తూ, ప్రజలకు ఆందోళనలు కలగకుండా చూసుకోవడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నది.
అయితే, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు మాస్కులు అందజేయాలని చూస్తున్నది. దీనికోసం ఇప్పటికే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. వైరస్ సోకకుండా ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలా అడ్డుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై అవగాహనా కలిగించే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
కరోనా విషయంలో ముందుగానే మేలుకొని చర్యలు తీసుకుంటే సమర్ధవంతంగా అడ్డుకట్ట వెయ్యొచ్చు అన్నది ప్రభుత్వం ఆలోచన. అందుకే అన్నింటిని తట్టుకొని నిలబడగలిగేలా సూచనలు ఇస్తున్నారు. కొన్ని రోజులుగా తిరుపతిలో కరోనా కలకలం వచ్చినా, కరోనా నెగెటివ్ గా నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదిలా ఉంటె కరోనా వలన ఇప్పటికే ప్రపంచంలో 3000 మందికి పైగా మరణించారు. 80వేలమంది ఈ వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. 70కిపైగా దేశాల్లో ఈ వైరస్ ప్రభావం చూపింది. ఒక్క అంటార్కిటికా మినహాయించి ఆరు ఖండాల్లో ఈ వైరస్ సోకడం విశేషం.