చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా లేదా కోవిడ్- 19 వైరస్ వల్ల రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతుంది. చైనా కాకుండా వివిధ దేశాల్లో కరోనా వైరస్ ప్రభావం వల్ల భయాందోళనకు గురవుతున్నారు. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో తొలి కరోనా కేసు నమోదైంది. ఈ వ్యాధి, రెండు వారాల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన ఓ యువకుడికి సోకిందని నిర్ధారణ అయింది. దుబాయ్ నుంచి వచ్చిన యువకుడు రెండు రోజుల పాటు బెంగళూరుకు వెళ్లి ఉద్యోగం చేసి వచ్చాడు. రెండు సార్లు బస్సులో ప్రయాణించాడు. బెంగళూరులో పలువురిని కలిశాడు. ఈ యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు.
పైగా అది ఏసీ బస్సు. దీంతో ఒక్కసారి వ్యాధి బాధితుడు తుమ్మినా, దగ్గినా, వైరస్ సులువుగా వ్యాపిస్తుంది. దీంతో ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై ఆందోళన చెందొద్దని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైనా నేపథ్యంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షించారు. కోఠిలోని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలోహైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి తదితరు అధికారులు పాల్గొన్నారు.
ఇక క భేటీ అనంతరం మంత్రి మాట్లాడుతూ... శాఖాపరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. 9 డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేస్తాయని మంత్రి వెల్లడించారు. ప్రతీ డిపార్ట్మెంట్కి ఒక నోడల్ ఆఫీసర్ను నియమిస్తామని చెప్పారు. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు, నర్సులను సరిపోయేంత మందిని తీసుకుంటామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నామని, కరోనా అనుమానం ఉన్న రోగులకు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు పంపాలని కోరినట్లు చెప్పారు. ప్రజలకు విశ్వాసం కలిగించడం అందరి బాధ్యత అని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.