ఏపీలో మరోసారి ఎన్నికలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. సాధారణ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చూసిన తెలుగుదేశం.. ఈ ఎన్నికలతోనైనా కాస్త కోలుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈసారి కూడా టీడీపీకి భంగపాటు తప్పదంటున్నారు వైసీపీ నేతలు. జగన్ సర్కారుపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న టీడీపీకి ముందు ముందు స్థానిక సంస్థల్లోనూ ఛీత్కారం ఎదురు కాబోతోందంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు.
ఆమె ఏమన్నారంటే.. “ త్వరలోనే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీ నేతలు పిచ్చి మాటలకు, మీ ప్రవర్తనకు స్థానిక ఎన్నికల్లో ప్రజలు సార్వత్రిక ఎన్నికల కంటే డబుల్గా ఛీత్కరిస్తారు. టీడీపీని తరిమికొడతారు.. మద్యాన్ని డోర్ డెలివరీ చేశారని టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. డోర్ డెలివరీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు కూడా సిద్ధమే. చట్టసభలో టీడీపీ మహిళా ఎమ్మెల్యేతో బ్రాండ్ల గురించి చంద్రబాబు మాట్లాడించారు. అమాయక మహిళా ఎమ్మెల్యేతో మద్యం బ్రాండ్స్ గురించి మాట్లాడించడం బాధాకరం. మద్యం ధరలు పెరిగితే..ఏదో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని
ఆర్కే రోజా మండిపడ్డారు.
" పెయిడ్ ఆర్టిస్టులతో మద్యం, రాజధాని అంశాలపై వీడియోలు తీయించి యూట్యూబ్లో పెట్టిస్తున్నారు. మానసిక రోగులుగా మారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. వైయస్ జగన్ మహిళల కోసం ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారో, వారి రక్షణ, సాధికారికత కోసం చేస్తున్న పనులను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. అమ్మ ఒడి, నామినేటేడ్ పదవులు, పనుల్లో 50 శాతం మహిళలకే రిజర్వేషన్లు, జగనన్న విద్యా దీవెన మహిళలకే ఇచ్చారు. వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ గృహ వసతి కూడా మహిళలకే ఇచ్చారని గుర్తు చేశారు రోజా.
దిశ చట్టాన్ని తీసుకువచ్చి, పోలీసు స్టేషన్లు కూడా ఏర్పాటు చేశాం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతుంది. ఈ రోజు రాష్ట్రంలోని మహిళలందరికీ వైయస్ జగన్ ఇచ్చిన నిజమైన కానుక ఈ మహిళా దినోత్సవం కాబోతుందని మహిళా ఎమ్మెల్యేగా, వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా గర్వంగా చెబుతున్నాను. ఇప్పటికైనా బార్ల గురించి, బీర్ల గురించి మాట్లాడటం మానేసి పెద్ద మనసుతో రాష్ట్రానికి మంచి చేస్తున్న వైయస్ జగన్పై బురద జల్లే కార్యక్రమాలు చేసి ప్రజల్లో చులకన కావద్దని ఆర్కే రోజా సూచించారు. మద్యం గురించి మాట్లాడేది మగవాళ్లు ఓట్లు వేస్తారనుకుంటే..ఆడవాళ్లు మీ బ్యాండ్ మోగిస్తారని రోజా హెచ్చరించారు.