చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా లేదా కోవిడ్-19 వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. శ్వాసవ్యవస్థపై పంజా విసిరే ఈ సూక్ష్మజీవి ఇప్పటికే వేల సంఖ్యలో బలితీసుకోగా.. వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచ దేశాలు వణికిస్తోంది. ఎప్పుడు ఎవరికి ఈ వైరస్ సోకుతుందో అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. మొన్నటికి మొన్న దేశంలో మూడు రాష్ట్రాల్లో... ఢిల్లీ, రాజస్థాన్, తెలంగాణలో ఈ వైరస్ కేసులు బయటపడి... దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉన్న వారి సంఖ్య ఆరుకు చేరింది. ఇక తాజాగా కామారెడ్డిలో మరొకరికి ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అతను కూడా వారం రోజుల క్రితం దుబాయ్ నుంచి రావడంతో కరోనా వైరస్ సోకిందనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో కరోనా కలకలం రేపింది. ఎల్లారెడ్డిపల్లికి చెందిన బాల్రాజ్(40) కొంతకాలం క్రితం దుబాయ్ వెళ్లాడు. వారం రోజుల క్రితమే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. జ్వరం, తుమ్ములు ఎక్కువగా ఉండడంతో మంగళవారం కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చాడు. అతడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు కోవిడ్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అయితే కామారెడ్డి జిల్లా కేం ద్రంలో కరోనా వైరస్ బాధితులను గుర్తించేందుకు, ప్రత్యేక చికిత్సలు అందించడానికి ప్రత్యేకంగా కేం ద్రాన్ని ఏర్పాటుచేశారు.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుప త్రిలో చికిత్స చేయకుండా హైదరాబాద్ గాంధీ ఆ సుపత్రికి రిఫర్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై కామారెడ్డి ఇన్చార్జి డీఎంఅండ్హెచ్ఓ చంద్రశేఖర్ను సంప్రదించగా.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సదరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడితో తాను మాట్లాడానని, పేషెంట్ పరిస్థితి ప్రకారం కోవిడ్ లక్షణాలు అంతగా కనిపించడం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం మాట్లాడుతూ.. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాతే బాధితుడికి జలుబు, జర్వం వచ్చిందని అతడి కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు. కాగా, ప్రస్తుతం సదరు వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.