తమిళనాడులోని మదురై జిల్లా అలంగానల్లూర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. తన భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. అలంగానల్లూర్ సమీపాన అరియూర్ లోని పట్టత్తరసి అమ్మన్ ఆలయ వీధికి చెందిన సుందర్ (42) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ఇందుమతి (35), పిల్లలు ఇద్దరు.. సునీల్ (13), విమల్ (9) ఉన్నారు.
కాగా., ఆయన భార్య ఇందుమతి కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతోంది. ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. ఇక ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఇటీవ కన్నుమూసింది. తన భార్య మరణాన్ని సుందర్ తట్టుకోలేక పోయాడు. ఆమె కాలం చేసిన దగ్గర నుంచి తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. సుందర్ ఆ బాధలో ఉండి కనీసం పిల్లలను కూడా పట్టించుకోవడం లేదు.
సుందర్ ఇక ఆమె భార్య లేకుండా ఉందలేననుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం ఆయన ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు అలంగానల్లూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ చూడగా.. ఎదురుగా సుందర్, సుందర్ ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు.
పోలీసులు ముగ్గురు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో సుందర్ విషం కలిపిన అరటి పండ్లు పిల్లలకు తినిపించి, తాను కూడా తిని ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. అతడికి భార్య అంటే ఎంతో ప్రేమని, ఆమె మరణాన్ని తట్టుకోలేక సుందర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు చెబుతున్నారు. తాను కూడా చనిపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళనతోనే విషం తినిపించి వారిని కూడా హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.