భారత్లో కరోనా వైరస్ క్రమక్రమంగా విజృంభిస్తోంది. ముందుగా కొద్ది రోజుల క్రితం కేరళ రాష్ట్రంలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో కేరళ వైద్యులు వెంటనే అప్రమత్తమై దానిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే మన దేశానికి చెందిన పలువురు ఇతర దేశాలకు వెళ్లి వస్తుండడంతో వారినుంచి కరోనా వైరస్ క్రమక్రమంగా ఇతరులకు కూడా విస్తరిస్తోంది. సోమవారం మనదేశంలో ముగ్గురికి కరోనా వైరస్ ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్ధారించారు. ఇక బుధవారం ఉదయానికి మొత్తం దేశ వ్యాప్తంగా 21 మంది బాధితులు ఉన్నట్టు లెక్క తేల్చారు. అధికారికంగానే వీరి సంఖ్య 21 వరకు ఉందంటే... అనధికారికంగా మనదేశంలో కరోనా బాధితలు మరికొంత మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.
ముందుగా ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టుకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అలాగే మరో 15 మంది టూరిస్టులకు వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారికీ కూడా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు తేలింది. ఇక హైదరాబాద్కు చెందిన ఓ 24 ఏళ్ల యువకుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సదరు బాధితుడు కంపెనీ వ్యవహారాలపై దుబాయ్ వెళ్లాడు. అక్కడ నుంచి తన టీంతో కలిసి హాంకాంగ్కు వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆ యువకుడు జ్వరంతో బాధపడుతున్నాడు.
ఈ యువకుడికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక తాజాగా బుధవారం మరో 15 మందికి కూడా కరోనా సోకినట్టు గుర్తించారు. 15 మంది ఇటాలియన్ పర్యాటకులు, వైరస్ కోసం పాజిటివ్ పరీక్షలు చేయించుకున్నారని, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ధృవీకరించింది. వీరికి కూడా కరోనా వైరస్ సోకినట్టు నిర్దారణ కావడంతో మనదేశంలో కరోనా వైరస్ సోకిన కేసులు అధికారికంగా లెక్క తేలినవి 21 కి పెరిగాయి. ఇక తెలంగాణలో కరోనా విజృంభిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.