ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ లో చేరిన వంగవీటి రాధాకృష్ణ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు . దానికి కారణం లేకపోలేదు . విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ను ఆయన ఆశించగా , అప్పటికే ఆ నియోజకవర్గం నుంచి బోండా ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తుండడం వల్ల, వంగవీటి రాధాకృష్ణ కు టికెట్ కేటాయించే పరిస్థితి లేకపోవడం వల్లే ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారన్న ఊహాగానాలు అప్పట్లో విన్పించాయి .
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వీడి రాధాకృష్ణ టీడీపీ లో చేరడానికి కూడా ప్రధాన కారణం , వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన కు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఇస్తామని హామీ ఇవ్వకపోవడమేనన్న ప్రచారం కూడా జరిగింది . అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో , ఎన్నికల్లో పోటీ చేయకుండా రాధాకృష్ణ దూరంగా ఉండడమే మంచిదైందన్న భావనలో ఆయన అభిమానులు ఉన్నారు . రానున్నరోజుల్లో రాధాకృష్ణ కంటూ ఒక నియోజకవర్గం కావాలని , ఇప్పటికీ ఆయనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కేటాయించే పరిస్థితి లేకపోవడంతో రాధాకృష్ణను సత్తనెపల్లి ఇంచార్జ్ గా నియమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది .
సత్తెనపల్లి నుంచి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహించిన విషయం తెల్సిందే . కోడెల మరణం తో సత్తెనపల్లి ఇంచార్జ్ స్థానాన్ని ఆయన కుమారుడికి కట్టబెడుతారని అందరూ భావించారు . కానీ పార్టీ నాయకత్వం మాత్రం సత్తెనపల్లి ఇంచార్జ్ గా రాధాకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది . దానికి కారణం లేకపోలేదని సత్తెనపల్లి లో మెజార్టీ సంఖ్య లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఉండడం, రాధాకృష్ణ కు ఇంచార్జ్ పదవి కట్టబెడితే పార్టీ మళ్లీ పుంజుకుంటుందని టీడీపీ నాయకత్వం భావిస్తోంది . అదే సమయం లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇద్దరి నేతల మధ్య పోటీ లేకుండా ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది . రాధాకృష్ణ సత్తెనపల్లి ఇంచార్జ్ గా వ్యవహరించేందుకు అంగీకరిస్తారో? లేదో ?? చూడాలి మరి.