అసలైన భారత దేశం ఆత్మ గ్రామాల్లోనే ఉందనేవారు గాంధీజీ.. అందుకే ఆయన గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్టు తీసుకొచ్చారు. పల్లెలు స్వతంత్ర్యంగా జీవించే పరిస్థితి రావాలనేవారు. పల్లెటూళ్లే దేశానికి పట్టుగొమ్మలు అనేవారు గాంధీజీ. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా గాంధీబాటలోనే సాగుతున్నారు. గ్రామాలను అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగు పడుతుందంటున్నారు. ఆమేరకు ప్రణాళికలు రచిస్తున్నారు.
గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ సచివాలయం, వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైయస్ఆర్ విలేజ్ క్లినిక్, ఇంగ్లిష్ విద్య వంటి మార్పులు తెస్తున్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధిలో ఇవన్నీ విప్లవాత్మక మార్పులు తెస్తాయన్నది జగన్ ఆలోచన. పల్లెటూళ్లను ఇప్పుడు మద్యం మహమ్మారి పట్టి పీడుస్తోంది. పేదల ఇళ్లలో కుంపట్లు పెడుతోంది.
అందుకే.. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామాల్లో బెల్ట్షాపులు నడవకూడదని జగన్ ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ సిబ్బంది వీటిపై కఠినంగా వ్యవహరించాలని జగన్ ఆదేశాలు ఇస్తున్నారు. మహిళా పోలీసుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలని సూచిస్తున్నారు.
బెల్ట్షాపుల నిరోధం మహిళా పోలీసుల ప్రాథమిక విధి అని, ఇందుకు మహిళా మిత్రలను కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని జగన్ ఇటీవల ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలని సీఎం వైయస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం వైయస్ జగన్ తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ చాలా మంది నాయకులు గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడారు. కానీ చేతల్లోకి రాలేదు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.