తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తాడ్ కోల్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు రాజారామ్ దుబ్బచెరువులో లభ్యమయ్యాయి. కన్నతండ్రే ముగ్గురు కూతుళ్లను హత్య చేసి చెరువులో పడేశాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి ఊపిరాడకుండా హత్య చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతులను అఫీయా(9), మహీన్ (7), జోయా(7)గా గుర్తించారు. 
 
గ్రామస్థులు కుటుంబకలహాలతో తండ్రి ఫయాజ్ ముగ్గురు పిల్లలను హత్య చేసినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఫయాజ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం గ్రామస్థులు సమాచారం అందించటంతో పోలీసులు చెరువు దగ్గరకు చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 
 
ఈరోజు ఉదయం పనికి వెళుతున్నానని తన భార్యకు చెప్పిన ఫయాజ్ తనతోపాటు ముగ్గురు పిల్లలను వెంట తీసుకెళ్లాడు. పిల్లలను చెరువు దగ్గరకు తీసుకెళ్లి నీటిలో ముంచి హత్య చేశాడు. పోలీసులు ముగ్గురు పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు నిందితుని భార్య చెబుతోంది. 
 
ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడి ఉండటంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది. ప్రతిరోజూ మద్యం తాగి తనను, పిల్లలను భర్త ఇబ్బందులు పెట్టేవాడని పోలీసులకు తెలిపింది. నిందితుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తుకున్నారు. నిందితుడు ఫయాజ్ ను కఠినంగా శిక్షించాలని నిందితుని భార్య, గ్రామస్థులు కోరుతున్నారు. పోలీసుల విచారణ తరువాత ఈ కేసులో ఇతర విషయాలు వెల్లడి కానున్నాయి. విచారణ తరువాత కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.                            

మరింత సమాచారం తెలుసుకోండి: