ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన దగ్గర నుంచీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాలను తనదైల శైలిలో ఆకర్షిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, విద్య, వైద్యం, అవినీతి రహిత పాలన, ఉపాధి కల్పన, మహిళల సంక్షేమం.. ఇలా వివిధ రకాల పాలనాంశాల్లో శరవేగంగా దూసుకుపోతున్నారు. ఎక్కడా అసంతృప్తి అనేది లేకుండా నిర్ణయాలను తీసుకుంటూ ముందుగు సాగుతున్నారు ఇక తాజాగా జగన్ సర్కార్ మహిళల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల సందడి మొదలైంది.
ఈ నెల 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ; 24న మున్సిపల్, 27న పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. 13 జిల్లాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మహిళలకు పెద్దపీట వేశారు. మొత్తం 13 జిల్లాల్లో.. ఎనిమిది జిల్లాలకు మహిళలే జెడ్పీ చైర్ పర్సన్లు కాబోతున్నారు.
జిల్లాల వారీగా రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపనుంది. జిల్లాల వారిగా రిజర్వేషన్లు చూస్తే.. శ్రీకాకుళం - బీసీ (మహిళ), విజయనగరం - జనరల్, విశాఖ - ఎస్టీ (మహిళ), తూర్పుగోదావరి - ఎస్సీ (మహిళ), పశ్చిమగోదావరి - బీసీ (జనరల్), కృష్ణా - జనరల్ (మహిళ), గుంటూరు - ఎస్సీ (మహిళ), ప్రకాశం - జనరల్ (మహిళ), నెల్లూరు - జనరల్ (మహిళ), చిత్తూరు - జనరల్, కడప - జనరల్, కర్నూలు - జనరల్, అనంతపురం - బీసీ (మహిళ). ఇక దీంతో జనరల్ అయిన చోట్ల నాయకులు తమకే స్థానం దక్కుతుందని ఎవరికి వారు పండగ చేసుకుంటున్నారు.