టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పునే మళ్ళీ రిపీట్ చేస్తున్నారా? అంటే ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిస్థితులని బట్టి చూస్తుంటే ఖచ్చితం అవునని చెప్పక తప్పదేమో. దాదాపు పదేళ్ళు అంటే 2004-2014 వరకు అధికారానికి దూరమైన చంద్రబాబు 2014లో అధికార పీఠం ఎక్కిన విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయింది. ఎక్కువ అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం. ఏ సీఎం జీవితంలో రాని విధంగా రాజధాని నిర్మాణం చేసే ఛాన్స్. ఆ ఐదేళ్లు తానెంటో నిరూపిస్తే మరో పదేళ్ళు చంద్రబాబే సీఎంగా ఉండేవారు.
కానీ అలా జరగలేదు. గ్రాఫిక్స్లో అభివృద్ధి, కావల్సిన వారికి కాంట్రాక్టులు, మన అనుకున్నవారికి పథకాలు. దీనికి తోడు ఏం చేసిన ‘బాబు గారు మీరు తోపు’ అని చెప్పే భజన బ్యాచ్. వెరసి 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం. జగన్ సీఎం అయిపోయారు. అయితే టీడీపీకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది...భజన బ్యాచ్ వల్లే. పార్టీ పరిస్థితి బాగోలేదని కింది స్థాయి కేడర్ హెచ్చరికలు చేసిన, వాటిని మాత్రం ఈ భజన బ్యాచ్ బాబు వరకు చేరనివ్వకుండా చేశారు. దాని వల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది బాబుకు తెలియలేదు. ఫలితంగా 23 సీట్లు వచ్చాయి.
సరే ప్రతిపక్షంలోకి వచ్చాం కదా, అని బాబు ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తున్నారా? అంటే అది లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అత్యంత ప్రాధాన్యం గలిగిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చూసుకునే బాధ్యత కూడా భజన బ్యాచ్కే ఇచ్చారు. ఇదే విషయంపై తెలుగు తమ్ముళ్ళు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షా సమావేశం నిర్వహించి, ఎన్నికల కసరత్తు కోసం కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, లోకేష్, సబ్బంహరి, టీడీ జనార్దన్, సాయిబాబా, కుటుంబరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్తో కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి ఒక్కో ఎమ్మెల్సీకు బాధ్యత అప్పగించాలని చూస్తున్నారు.
పైన కమిటీలో ఉన్న వారు ఎవరో ఏంటో తెలిసిందే. ఇక వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేవిధంగా టీడీపీలో ఉన్న ఎమ్మెల్సీలు గురించి పెద్దగా మాట్లాడాల్సిన పనిలేదు. వారిని చూసే కదా జగన్ ఏకంగా మండలి రద్దుకే సిఫారసు చేశారు. దాదాపు వీరంతా భజన బృందమేనని, దీని వల్ల జగన్కే మేలు జరుగుతుందని అంటున్నారు. దీంతో మళ్ళీ 2019 ఎన్నికల్లో చేసిన తప్పునే బాబు రిపీట్ చేస్తున్నారని, ఈసారి ఏదొరకంగా గెలిచే స్థానాల్లో కూడా పార్టీ ఓటమి పాలవ్వడం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు.