ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిలకు సంబంధించిన నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ రమేష్ కుమార్ ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. 660 జడ్పీటీసీ, 9639 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడు దఫాలుగా ఎ్నికలు రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 9 నుంచి 11 వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు దాఖలు ప్రక్రియ జరగనుంది. ఈనెల 21న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటిస్తారు. ఇక ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
ఈ నెల 27న తొలివిడుత పంచాయతీ ఎన్నికలు, 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. పంచాయతీ ఎన్నికల తొలి విడత షెడ్యూల్లో భాగంగా మార్చి 15న నోటిఫికేషన్, మార్చి 17 నుంచి 19 తేదీల మధ్య నామినేషన్ల స్వీకరణ జరగనుంది. మార్చి 20న నామినేషన్లు పరిశీలించనున్నారు. మార్చి 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదిగా నిర్ణయించారు. మార్చి 27న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక రెండో విడత నోటిఫికేషన్ 17వ తేదీన జరగనుంది. 19 నుంచి 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 22న పరిశీలన, 24వరకు ఉపసంహరణ జరగనుంది. 29న పోలింగ్ అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా, నామినేషన్ల పరిశీలన 9 నుంచి 11వ తేదీల మధ్య జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 14 కాగా, ఎన్నికల పోలింగ్ మార్చి 21 ఉండనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 24న జరగనుంది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా నోటిఫికేషన్ విడుదల 9వ తేదీ జరగనుంది. నామినేషన్ల స్వీకరణ మార్చి 11-13 వరకూ ఉండనుంది. నామినేషన్ల పరిశీలన మార్చి 14న జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 14 తుది గడువు. ఎన్నికల పోలింగ్ మార్చి 23 నిర్వహించనచుండగా మార్చి 27 ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది.