మనదేశంలో కుటుంబ రాజకీయాలు ఎక్కువ. ఆ మాటకు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే కుటుంబం మొత్తం రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి అరుదైన రికార్డునే కింజారపు ఫ్యామిలీ సంపాదించింది. దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుతో ప్రారంభమై ఈ కుటుంబ రాజకీయ ప్రస్థానం ఆ తర్వాత ఆయన తమ్ముడు మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆ తర్వాత ఆయన కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో వెలుగుతూ వస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గాలిలో టెక్కలిలో అచ్చెన్న గెలిచి మంత్రి అయ్యారు.
ఇక తండ్రి చనిపోవడంతో వచ్చిన సానుభూతి పవనాల నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు భారీ మెజార్టీతో విజయం సాధించారు. అక్కడి వరకు బాగానే ఉన్నా గతేడాది జరిగిన ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్నతో పాటు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు తిరిగి విజయం సాధించారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి సిటీలో ఏకంగా 30 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి సంచలనం రేపారు. రాష్ట్రం అంతటా వైసీపీ గాలి బలంగా వీచినా దాన్ని తట్టుకొని తెలుగుదేశం పార్టీ తరఫున వారు ముగ్గురు గెలుపొందారు.
అచ్చెన్న, రామ్మోహన్ అప్పటికే మంత్రి, ఎంపీగా ఉన్నారు. కానీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన భవానీ తన తండ్రి ఫ్యామిలీతో పాటు ఇటు భర్త ఫ్యామిలీ రాజకీయ వారసత్వాన్ని అంది పుచ్చుకుని తొలి ప్రయత్నంలోనే భారీ మెజార్టీతో గెలిచారు. ఇంత తీవ్ర వ్యతిరేక గాలులను తట్టుకుని ఆమె విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఖచ్చితంగా భవానీతో పాటు అక్కడ ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఉన్న కుటుంబ ఇమేజ్ అని చెప్పాలి.
భవానీ సైతం చక్కటి వాక్చాచుతర్యంతో పాటు మహిళా ఓటర్లతో పాటు అందరిని ఆకర్షించి తన సత్తా ఏంటో చాటుకున్నారు. నాన్ కాంట్రవర్సీయల్ పాలిటిక్స్తో తన ముద్ర వేస్తోన్న భవానీ భవిష్యత్ ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే మహిళా రాజకీయ నేతగా ఎదుగుతారనడంలో సందేహం లేదు.