సత్యవతి రాథోడ్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల తండా నుంచి ఎదిగిన గిరిజన ముద్దుబిడ్డ.. ఓటమెరుగని నేతను అసెంబ్లీ ఎన్నికల్లో మట్టికరిపించిన మహిళా నాయకురాలు.. రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదురైనా కుంగిపోకుండా ముందడుగు వేసిన గుండెధైర్యం ఆమె సొంతం. సూటిపోటిమాటలు తూటాల్లా దూసుకొచ్చినా ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. మౌనమే సమాధానంగా ముందుకు పడుతున్న ఆమె అడుగులను అడ్డుకోలేకపోయాయి. ఆ నమ్మకమే నేడు ఆమెను అందరిముందు ఆదర్శంగా నిలబెట్టింది. ఉన్నతమైన పదవులను కట్టబెట్టింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో చోటుదక్కేలా చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్పై ప్రత్యేక కథనం మీకోసం.
సత్యవతి రాథోడ్ సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి రెడ్యా నాయక్కు సమీప బంధువే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలోని గుండ్రాతి మడుగు ఆమె స్వస్థలం. టీడీపీలో ఉన్నప్పుడు నాటి వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎస్టీ మహిళకు రిజర్వ్డ్ కావడంతో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆమె 2006లో కురవి జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆమె 2009 ఎన్నికల్లో డోర్నకల్ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి నాడు మంత్రిగా ఉన్న రెడ్యా నాయక్ను ఓడించి సంచలనం క్రియేట్ చేశారు. రెడ్యా నాయక్ సత్యవతికి వరుసకు వియ్యంకుడు అవుతారు.
ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు ఆమె టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె రెడ్యా చేతిలో ఓడిపోయారు. తర్వాత రెడ్యా టీఆర్ఎస్లోకి వచ్చారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఆమెకు సీటు ఇవ్వలేదు. ఇక మధ్యలో రాజకీయంగా రెడ్యా నాయక్ నుంచి ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. మధ్యలో ఆమె భర్త మృతి చెందడంతో వ్యక్తి గత జీవితం కూడా ఇబ్బందులతో ఆమె ఎంతో ఆవేదనకు గురయ్యారు.
ఆ తర్వాత ఆమె నమ్మకాన్ని నిజం చేస్తూ కేసీఆర్ ముందుగా సత్యవతికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ చరిత్రలోనే తొలి మహిళా మంత్రిగా సత్యవతి రాథోడ్ రికార్డులకు ఎక్కారు. ఇలా జడ్పీటీసీ నుంచి ప్రారంభమైన ఆమె ప్రస్థానం ఎన్నో ఇబ్బందులు, ఆటు పోట్ల తర్వాత నేడు తెలంగాణ తొలి మహిళా మంత్రిగా ఎదిగే వరకు వెళ్లింది. ఇప్పటకీ రాజకీయంగా ఆమెను ఇబ్బంది పెట్టేవాళ్లు ఎందరున్నా ఆమె వాటన్నింటిని సైలెంట్గా వదిలేస్తూ ముందుకు వెళుతున్నారు.