ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చే దిశగా జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉగాది నాటికి 26 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ లక్ష్యంగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 14వేలకు పైగా వైఎస్అర్ జగనన్న కాలనీను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ గృహ నిర్మాణ రంగంలో ఇది సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. ఇప్పుడిస్తున్న ఇళ్లపట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై అధికారులతో సమీక్షించారు.  ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ద్వారా ఇప్పటివరకూ మంజూరైన ఇళ్ల వివరాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద ఇంకా ఎన్ని ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉందో తెలుసుకున్నారు. కేంద్రం నిధులు పోనూ రాష్ట్రం ఎంతమేర భరించాల్సి ఉంటుందో కనుక్కున్నారు.

 

మొత్తమ్మీద ఉగాది నాటికి 26 లక్షల 60 వేల ఇళ్లపట్టాలు ఇవ్వనున్నామని, వచ్చే నాలుగేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇప్పుడు పట్టాలు పొందుతున్న పేదలతోపాటు, సొంతంగా ఇళ్లస్థలాలు ఉన్న పేదలకూ ఇళ్లునిర్మిస్తామని చెప్పారు. మరోవైపు మున్సిపాలిటీలు, నగరాభివృద్ది సంస్థల పరిధిలో దాదాపు 19.3 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళికలు వేసినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గృహనిర్మాణ శాఖలో ఉన్న 4,500 మంది ఇంజినీర్లతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమితులైనవారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని వివరించారు. మొత్తంగా 45వేల మంది సిబ్బందితో ఈ మహాక్రతువును నిర్వహిస్తామని చెప్పారు. 

 

ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పలు సూచనలు చేశారు. ఇళ్లన్నీ ఒకే నమూనాలో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా చూడాలన్నారు సీఎం. ఒక బెడ్‌రూం, కిచెన్, వరండా, టాయిలెట్‌ ఉండేలా డిజైన్‌ రూపొందించారు. ఇళ్లు కట్టిన తర్వాత ఆ ఇంటిపై 25వేల రూపాయల వరకూ పావలావడ్డీకే రుణం ఇచ్చేలా బ్యాంకులతో ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అత్యవసరాలకు ఈ డబ్బు పేదవారికి చాలా మేలు చేస్తుందని, అధిక వడ్డీలకోసం ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండదని సీఎం అన్నారు. పేదలకు కడుతున్న కాలనీల్లో చెట్లు నాటాలని, డ్రైనేజీ ఏర్పాటుపైనా సరైన ప్రణాళిక అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కరెంటు, తాగునీటి వసతి కూడా కల్పించాలన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: