తండ్రి నమ్మకాన్ని నిలబెట్టిన కూతురు ఆమె.. నాన్నఅండదండలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏమాత్రం తడబడకుండా ముందుకు వెళ్తున్న నాయకురాలు.. ఓవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు రాజకీయాలు.. ఇలా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ తలుపుతట్టి మానుకోట ఎమ్మెల్యేగా చెరగని ముద్రవేశారు. గెలుపోటములు శాశ్వతం కాదనీ.. ప్రజలే శాశ్వతమని నమ్మే ప్రజా నాయకురాలు ఆమె. ఆ నమ్మకమే ఆమెను భారత పార్లమెంట్లో అడుగుపెట్టిన తొలి గిరిజన మహిళా ఎంపీగా నిలబెట్టింది. ఆమె మరెవరో కాదు.. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవి.. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కూతురు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మీ కోసం..
తండ్రి సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి రెడ్యా నాయక్ రాజకీయ వారసత్వం అంది పుచ్చుకున్న మాలోతు కవితా భద్రూ నాయక్ 2009లో గిరిజనులకు రిజర్వ్ డ్ అయిన మహబూబా బాద్ (మానుకోట) అసెంబ్లీ స్తానం నుంచి పోటీ చేసి 17 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2014 ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తండ్రితో పాటు టీఆర్ఎస్లోకి జంప్ చేసిన కవిత తిరిగి మానుకోట అసెంబ్లీ సీటు ఆశించారు.
అయితే కేసీఆర్ మాత్రం ఆమెను అసెంబ్లీకి కాకుండా గతేడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో మానుకోట నుంచి పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో ఆమె ఏకంగా లక్ష పై చిలుకు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ క్రమంలోనే తండ్రి వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఆమె ఓ సారి ఎమ్మెల్యేగాను, మరోసారి ఎంపీగాను గెలిచి సత్తా చాటారు. ఈ క్రమంలోనే భారత పార్లమెంటులో అడుగు పెట్టిన తొలి గిరిజన మహిళా ఎంపీగా కూడా అరుదైన రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు.