ఏ తల్లిదండ్రులకైనా వారి పిల్లలు చిచ్చరపిడుగులు కావాలనే అభిలాష ఉంటుంది. అన్ని విషయాల్లోనూ దూకుడుగా ఉండాలనే కోరికా ఉంటుంది. చిట్టిపొట్టి నడక నుంచి ప్రపంచాన్ని చదివే వరకు తమ చిన్నారులు వెలుగు దివ్వెలు కావాలనే కలలకు ఆ తల్లిదండ్రుల్లో కొదవే ఉండదు. మరి ఈ కలల సాకారం అందరికీ సాధ్యమేనా? అందరు తల్లిదండ్రులూ తమ చిన్నారులతో హ్యాపీగానే ఉంటున్నారా? పిల్లలను చూసుకుని పట్టలేని ఆనందాన్ని పొందుతున్నారా? అంటే.. కొందరి విషయంలో మాత్రం చెప్పలేం! అంతులేని సమస్యతో అల్లాడే చిన్నారులను చూసుకుని నిత్యం కంటికీ మంటికీ ఏకధార అవుతున్న తల్లిదండ్రులు కూడా ఉంటారు. పుట్టుకతోనే సంక్రమించే అనేక వ్యాధులతో తల్లడిల్లుతున్న చిన్నారులను చూసుకుని ఆ తల్లిదండ్రులు బాధలు అన్నీ ఇన్నీ కావు.
రోగానికి భాషలేదు.. ప్రాంతం లేదు.. అన్నట్టుగా ఆటిజం (బుద్ధిమాంద్యం) అనే వ్యాధి చిన్నారుల జీవితాలను మొగ్గలోనే దారిమళ్లిస్తున్న పరిస్థితి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పుట్టుకతోనే ఈ వ్యాధి భారిన పడి కొన్ని కోట్ల మంది చిన్నారులు.. అల్లాడుతున్నారు. కన్నవారిని గుర్తించలేక, వారు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియక, ఎదుటివారు చెప్పేది అర్ధం కాక... ఓ విధమైన మానసిక సమస్యను ఎదుర్కొంటూ.. జీవితాలను భారంగా వెళ్లదీస్తున్నారు. మరి ఈ వ్యాధి మందులతో నయం అవుతుందా? లేక భౌతిక వ్యయామాలతో నయం అవుతుందా? అంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో టెక్నాలజీ అబివృద్ది చెందిందని, కొన్ని కొన్ని సార్లు చచ్చిపోయే మనిషిని కూడా బతికించే మందులు వస్తున్నాయంటూ.. ప్రచారాలు పోటెత్తుతున్నా.. ఆటిజం వంటి వాటికి మాత్రం ఇప్పటి వరకు ఇతమిత్థంగా ఎలాంటి ఔషధాలూ లేక పోవడం గమనార్హం.
దీంతో ప్రపంచ వ్యాప్తంగాకొన్ని కోట్ల మంది చిన్నారులు.. సాధారణ చిన్నారుల మాదిరిగా తమ జీవితాలను తీర్చిదిద్దుకోలేక పోతున్నారు. శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగానే ఉన్నా.. అన్ని అంగాలు పని చేస్తున్నా.. మానసికంగా మాత్రం సత్తువ కొల్పోయి.. సహజ సమాజానికి దూరమవుతున్నారు. మరి ఇలాం టి వారికి ఆత్మీయ స్పర్శ ఎక్కడ? ఇలాంటి వారికి భవిష్యత్తు ఎక్కడ? ఇక వీరు సమాజంలో తృతీయ పౌరులుగా ఒకరిపై ఆధారపడి బతకాల్సిందేనా? వీరి వైకల్యానికి చెక్ పెట్టే మార్గం లేదా? అంటే.. ఇలాంటి చిన్నారులకు ఆత్మయ స్పర్శను అందించడమే ధ్యేయంగా ఏర్పడింది.. పినాకిల్ బ్లూమ్స్ సంస్థ. హైద రాబాద్లోని సుచిత్ర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఆటిజం చిన్నారుల పాలిట ఓ అద్భుత మనే చెప్పాలి.
ఆటిజం సమస్యను ఎదుర్కొంటున్న చిన్నారులకు ఈ సంస్థ అనేక రూపాల్లో స్వచ్ఛంద సేవను అంది స్తోంది. తమ సమస్యకు పరిష్కారం కనుగొనడంతోనే సరిపెట్టుకోని శ్రీజారెడ్డి సరిపల్లి.. ఆటిజం సమస్యను ఎదుర్కొంటున్న కొన్ని కోట్ల మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు దివ్వెలు వెలిగిస్తున్న `నైటింగేల్`గా మారారు. మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీజా రెడ్డి అటిజంతో బాధపడుతోన్న పిల్లల జీవితాల్లో ఎలా చిరునవ్వులు నింపుతున్నారో ? ఆమె తమ కుమారుడి సమస్య కోసం వెతికిన పరిష్కారంలో ఎంతో మంది చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపుతున్నారో ? తెలిస్తే ప్రశంసించాల్సిందే. ఐటీ రంగంలో విప్లవాలు సృష్టించిన సరిపల్లి కోటి రెడ్డి, శ్రీజారెడ్డి దంపతుల చిన్నారికి ఆటిజం సమస్య ఏర్పడింది. దీంతో చిన్నారి కలిగిందనే ఆనందం ముందు ఈ ఆటిజం తమకు పెను సమస్యగా పరిణమించింది. ఈ క్రమంలోనే అనేక దేశాల్లో ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేశారు. అయితే, దీనికి సరైన ఔషధాలు లేకపోవడం, ఫిజియో థెరపీ (భౌతిక చికిత్స)తోనే మెరుగైన ఫలితం వస్తుందని నిపుణులు సూచించడంలో తమ బిడ్డకు అదే విధమైన చికిత్సను అందించారు.
అంతటితో ఈ దంపతులు చేతులు ముడుచుకుని ఉంటే.. నేడు ఈ వీరి గురించి ఎవరూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ, తమ బిడ్డలా బాధపడే చిన్నారుల సమస్యలను కూడా పరిష్కరించాలని నడుం బిగించారు శ్రీజారెడ్డి. ఈ క్రమంలో అసలు ఈ వ్యాధి ఏంటనే విషయంపై దృష్టిపెట్టి అధ్యయనం చేశారు. దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది పరిష్కారం లభించని వ్యాధే అయినప్పటికీ.. చిన్నారుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉన్న విధానాలను వెలుగులోకి తెచ్చారు. ఒక్కొక్కొ చిన్నారిని అధ్యయనం చేసి, వారిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తొలిగా సుచిత్ర ప్రాంతంలో పినాకిల్ బ్లూమ్స్ను ఏర్పాటు చేశారు.
ఈ సంస్థలో ఆక్యుపేషనల్ థెరపీ, ప్లే అండ్ స్టడీ గ్రూప్స్, ఎర్లీ ఇంటర్ వెన్షన్ సెంటర్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్లను ఏర్పాటు చేశారు. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు ఎక్కడెక్కడో లభించే అనే చికిత్సలను ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. మూడేళ్ల కృషి అనంతరం ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు కుటుంబం నుంచే ఎక్కువగా సాంత్వన అందాల్సిన అవసరాన్ని గుర్తించి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అదే సమయంలో పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేసేలా వారికి శిక్షణ ఇచ్చారు. ఇక, చిన్నారుల్లో ఆటిజం స్థాయిలను బట్టి.. వారు మూడు నెలల నుంచి రెండేళ్ల వరకు తమ కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.
బహుశ అన్ని చికిత్సలు ఒకే వేదికపై ఏర్పాటు చేసి చిన్నారుల జీవితాల్లో వెలుగు లు నింపుతున్న సంస్థ ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ప్రస్తుతం 14 కేంద్రాలను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగానే చికిత్స అందిస్తున్నారు శ్రీజారెడ్డి. మదర్ థెరిసా చెప్పినట్టు.. ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్న సూత్రాన్ని మనసా వాచా నమ్మిన శ్రీజారెడ్డి.. చిన్నారులకు అందిస్తున్న సేవ నిజంగా నభూతో నభవిష్యతి.. అని అనకుండా ఉండేలేం..!