17 రాష్ట్రాల్లోని 55 రాజ్యసభ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల్లో సందడి మొదలైంది. తాజాగా, ఒడిషా ముఖ్యమంత్రి, బీజేడీ(బిజూ జనతా దళ్) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తమ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించారు. వారిలో సుభాష్ సింగ్, మునా ఖాన్, సుజీత్ కుమార్, మమతా మహంతా ఉన్నారు. కాగా, ఏప్రిల్ నెలలో 17 రాష్ట్రాల్లోని 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. అందులో ఒడిషా నుంచి 4 స్ధానాలు ఖాళీ అవనున్నాయి. బీజేడి రాజ్యసభ సభ్యులు అనుభవ్ మహంతి, నరేంద్ర స్వైన్, సరోజిని హెంబ్రామ్ సహా కాంగ్రెస్ ఎంపీ రంజీబ్ బిశ్వాల్ ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. కొద్దికాలం క్రితం వరకూ రాజకీయ విశ్లేషకుడు పవన్ ఆర్జేడీలో ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, దేశవ్యాప్తంగా మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఏపీ నుంచి అలీఖాన్, సుబ్బిరామిరెడ్డి, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రాజ్యసభ సీట్లకు శుక్రవారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేశారు. నామినేషన్ పత్రాలు శాసనసభ కార్యదర్శి లేదా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పొందొచ్చు. ఎన్నిక అనివార్యమైతే మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్లో నిర్వహిస్తారు.
పెద్దల సభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవే
--- ఎన్నిక జరిగే స్థానాలు-55
-- ఎలక్షన్ నోటిఫికేషన్-మార్చి 6
-- నామినేషన్లకు చివరి తేది -మార్చి 13
-- నామినేషన్ల పరిశీలన- మార్చి 16
-- నామినేషన్ విత్డ్రా చివరి తేదీ- మార్చి 18
-- ఎలక్షన్ తేది, ఫలితాలు విడుదల- మార్చి 26