మనిషి మేదస్సు విశ్వాంతరాలాలు దాటుతున్నా ఇంకా కులం అనే కుళ్లును మాత్రం వదులుకోలేకపోతున్నాడు. మనం 21 వ శతాబ్దంలోకి అడుగుపెడుతున్నా.. ఇంకా పరువు హత్యలు అడపాదడపా కనిపిస్తూనే ఉన్నాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగి ప్రణయ్‌ హత్య మనిషుల్లోని రాక్షసత్వాన్ని మరోసారి తెర మీదకు తీసుకువచ్చింది. కూతురు అమృత మరో కులం వాడ్ని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో ఆ వ్యక్తి కత్తులతో నరికి చంపించాడు మారుతి రావు. కన్నతండ్రి అన్న విచక్షణ కూడా కోల్పోయి కూతురి పసుపు కుంకాలు తుడిచేశాడు. ఇంకా లోకం చూడని పసికందుని అనాథని చేశాడు.

 

ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కాలంలో కూడా మనుషుల్లో కుల పిచ్చి ఏ స్థాయిలో ఉందో తెర మీదకు వచ్చింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన తరువాత మారుతి రావుతో పాటు ఈ హత్యకు కారణమైన వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. కేసు విచారణ జరుగుతోంది. కొంత కాలానికి అసలు ముద్దాయి మారుతి రావుతో పాటు ఇతర నింధితులు బెయిల్‌ మీద విడుదల అయ్యారు. దీంతో మరోసారి అమృత కుటుంబంలో భయాందోళనలు నెలకొన్నాయి. జైలు నుంచి బయటకు వచ్చిన మారుతిరావు కూతురితో కేసు విషయంలో బేరాసారలు చేశాడు. కేసు వెనక్కి తీసుకోవాలని ఆమె మీద ఒత్తిడి చేసే ప్రయత్నం చేశాడు.

 

ఈ నేపథ్యంలోనే అమృత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మారుతిరావును మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు బెయిల్‌ పై విడుదల చేశారు. అయితే కూతురు కాంప్రమైజ్‌కు అంగీకరించకపోవటం తో మారుతి రావు లో భయం మొదలైంది. అదే సమయంలో ఆస్తి విషయంలో తమ్ముడితో వివాదం జరుగుతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం మారుతి రావు హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మ హత్య చేసుకున్నాడు. అయితే అప్పుడు ప్రణయ్‌ హత్యకు కులం కారణం అయితే.. ఇప్పుడు మారుతి రావు మృతికి ఆయనలోని భయం, అక్రమంగా ఆయన సంపాదించిన ఆస్తులు కారణమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: