ఉమ్మడి ఏపీకి, విభజన ఏపీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుని ఆదుకున్నది ఎపుడూ ఉత్తరాంధ్రానే. బాబుకు గత ఎన్నికల్లో జగన్ తో గట్టి పోటే వేస్తే ఆయన్ని ఎత్తి కూర్చోబెట్టి సీఎం పీఠం ఇచ్చింది కూడా ఈ మూడు జిల్లాలే. ఇపుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ జిల్లాలు ఎటువైపు టర్న్ ఇచ్చుకోబోతున్నాయి.
అంటే ఈ జిల్లాలపైన చంద్రబాబు ఆశలు వదిలేసుకోవాలనే అంటున్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. బాబు ఉత్తరాంధ్రాకు చేసిన ద్రోహానికి ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపు ఇస్తున్నారు. విశాఖ రాజధానిగా జగన్ ప్రతిపాదిస్తే అడ్డుకోవడానికి బాబు రెడీ అయ్యారని ఇంతకంటే ద్రోహం ఉంటుందా అని విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తున్నారు.
బాబుకు ఇక్కడ ఓట్లు కావాలి తప్ప ప్రజలు, వారి ప్రయోజనాలూ అవసరం లేదా అని ఆయన గద్దించారు. విశాఖకు రాజధాని అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయని కూడా ఆయన అంటున్నారు. అటువంటి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఈసారి కనీసం డిపాజిట్లు రాకుండా ఓడించాలని ఆయన ఉత్తరాంధ్ర ప్రజలకు పిలుపు ఇచ్చారు. గతసారి కొద్దో గొప్పో ఓట్లూ సీట్లూ వచ్చాయి. ఈసారి అది కూడా లేకుండా చేయాలని ఆయన కోరారు. అపుడు ఉత్తరాంధ్రాకు బాబు రాకుండా ఉంటారని ఆయన అంటున్నారు. చూడబోతే ఈ మూడు జిల్లాలూ మరోమారు టీడీపీకి ఝలక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి.
ఇప్పటికే పార్టీకి గట్టి నాయకులు లేకుండా పోయారు. ఉన్న నాయకులు కూడా ఎందుకొచ్చిన తంటా అని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో చూస్తూంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గత ఎన్నికల మ్యాజిక్ రిపీట్ అయ్యేఅలా ఉందని తమ్ముళ్ళు తలచుకుని హడలిపోతున్నారుట. మరి సైకిల్ పార్టీ ఫేట్ ఎలా అన్నది చూడాలి కాబోలు.