కరోనా వైరస్ మహమ్మారిలా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 97 దేశాల్లో 1,02,180 మందికి కరోనా వ్యాపించగా, ఇప్పటికే 3500 మందికి పైగా ఈ వైరస్ వల్ల చనిపోయారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఆ ప్రాణాంతక వైరస్ను అదుపు చేసేందుకు అన్ని దేశాలు నడుం బిగించాయి. మనదేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 31కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సంజీవ్ కుమార్ ప్రకటించారు. ఇలా దేశంలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో ఓ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా తమ రాష్ట్రంలోకి విదేశీయుల రాకను నిలిపివేసింది. అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అరుణాచల్ప్రదేశ్లో పర్యటించే విదేశీలయులకు ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్స్ (పీఏపీ)లు ఇస్తుంటారు. అయితే, రాష్ట్రంలో పర్యటించాలనుకునే అతిథులకు పీఏపీలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పీఏపీ ఇష్యూయింగ్ అథారిటీలకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నందున, విదేశాల నుంచి వస్తున్న వారి వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.
కాగా, కరోనా వ్యాప్తితో అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు వరల్డ్ బ్యాంక్ భారీ రుణ సాయానికి సిద్దమైంది. కరోనాపై పోరాటం చేస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశాలకు .. వరల్డ్ బ్యాంక్ సుమారు 12 బిలియన్ల డాలర్లు సాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ ప్యాకేజీ తరహాలో వరల్డ్ బ్యాంక్ ఆయా దేశాలకు ఆ డబ్బును ఖర్చు చేయనున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు, గ్రాంట్లు, టెక్నికల్ సహకారం అందించేందుకు కూడా వరల్డ్ బ్యాంక్ సిద్దమైంది. తాము ఇచ్చే నిధులతో అభివృద్ధి చెందుతున్న దేశాలు.. పబ్లిక్ హెల్త్ వ్యవస్థను పటిష్టం చేయాలని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. అత్యంతపేద దేశాలను ఎంపిక చేసి.. నిధులను చేరవేస్తామని వరల్డ్ బ్యాంక్ వివరించింది.