స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇటీవ‌లే పొత్తు కుదుర్చుకున్న బీజేపీ-జనసేన పార్టీలు త‌మ ఎత్తుగ‌డ‌లు సిద్ధం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ జీ అధ్య‌క్ష‌త‌న‌ విజయవాడలో ఇరు పార్టీల ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీల సభ్యులతో  సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. రానున్న స్థానిక ఎన్నికల్లో కలసి ముందు వెళ్లే అంశం మీద ఇరు పార్టీల నేతల మధ్య కీలక చర్చ జరిగింది. స‌తీష్ జీ ఈ సంద‌ర్భంగా ఇరు పార్టీల నేత‌ల‌కు వివిధ అంశాల‌పై వివ‌రించారు. అనంతరం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ముఖ్య నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 12న బీజేపీ-జనసేనల మేనిఫెస్టో విడుద‌ల చేస్తామ‌ని నేత‌లు ప్ర‌క‌టించారు. సత్వరమే అభ్యర్ధుల ఎంపిక చేసి   రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన సమన్వయంతో ముందుకు వెళ్తాయని మ‌నోహ‌ర్ వెల్ల‌డించారు. `సమావేశంలో ఎన్నికలలో కలసి ముందుకు వెళ్లడంతోపాటు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా భవిష్యత్తులో కేంద్రం సహకారంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశం మీద ఇరు పక్షాల ఆలోచనలు పంచుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాం.భవిష్యత్తులో కలసి ప్రజల తరఫున పోరాటాలు చేయడంతో పాటు మోడీ నాయకత్వంలో రాష్ట్రానికి మేలు చేయాలని నిర్ణయించడం జరిగింది` అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. ``భవిష్యత్తులో ఈ పొత్తును మరింత దృఢంగా, విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తాం. నాయకత్వాన్ని బలపర్చుకుంటూ ఓ అవగాహనతో ఇరు పార్టీల నేతలు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్తాం. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం.`` అని వివ‌రించారు.

 

ప్రభుత్వ ఎత్తుగడను తిప్పికొట్టే విధంగా జనసేన, బీజేపీలు సమన్వయంతో ముందుకు వెళ్తాయని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ``ప్రతిపక్షాలను దెబ్బ తీసే ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని చూస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలు, కక్షపూరిత ధోరణులు మినహా వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం. బీజేపీ, జనసేన కార్యకర్తల మీద జిల్లాల్లో దాడులు చేస్తున్నారు, పోలీసుల సహాయంతో అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. జనసేన-బీజేపీలు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్రామ స్థాయిలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు వెళ్తాం. బీజేపీ-జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం`` అని అన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ కమిటీలు వేసుకుంటూ స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించామ‌ని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: