కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత తులసీరెడ్డికి ఏమైందో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే నోటికేదొస్తే అంతా మాట్లాడేస్తున్న తులసీరెడ్డిని చూస్తుంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే తులసీరెడ్డిలో ఈర్ష్య పేరుకుపోతోందన్న విషయం అర్ధమైపోతోంది. ఆ విషయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే బిజెపికి వైసిపి తోక పార్టీనట. కాబట్టి ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపినిచ్చారు లేండి.

 

రాబోయే ఎన్నికల్లో వైసిపిని ఓడించాలని తులసీ చెప్పటం వరకు ఓకేనే. కాకపోతే బిజెపికి తోక పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన అభ్యర్ధులను స్ధానిక సంస్ధల ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజానికి తెలంగాణాలో జరిగిన ముందస్తు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీయే తెలుగుదేశంపార్టీకి తోక పార్టీగా మారిపోయిన విషయాన్ని రెడ్డిగారు మరచిపోయినట్లున్నారు. రాజస్ధాన్ సిఎం అశోక్ గెహ్లాట్ లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా అమరావతికి వచ్చి నేరుగా చంద్రబాబునాయుడుతో భేటి అయి వెంటనే తిరిగి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలుసు.

 

సరే జనసేన పార్టీ అంటారా ఒకపుడు టిడిపికి తోక పార్టీగాను ఇపుడు బిజెపికి తోక పార్టీగాను మారిపోయిన విషయం మాత్రం నిజం. వాస్తవం ఇలాగుంటే బిజెపికి వైసిపి తోకపార్టీగా ఎలా మారిపోయిందో ఎవరికీ అర్ధంకావటం లేదు.  అధికారంలో ఉన్నపార్టీ ఎవరికైనా తోకపార్టీగా ఎందుకు మారిపోతుంది ?  జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళెవరూ ఇంకోళ్ళకు తోకగా ఉండటానికి ఇష్టపడడన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధిని ధిక్కరించి బయటకు వచ్చేసింది ఈ పాయింట్ మీదే కదా ?

 

మరో విచిత్రమైన పాయింట్ ఏమిటంటే సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యకేసులో పురోగతి సాధించలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలిస్తాడని అడగటమే విచిత్రంగా ఉంది. జగన్ తీరుతో వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తోందట. ఏదేమైనా తులసీరెడ్డి మాటలు వింటుంటే జగన్ అంటే జెలసీ వల్లే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్న విషయం అందరికీ అర్ధమైపోతోంది. మరి అందరు అనుకుంటున్న విషయం తులసీరెడ్డికి అర్ధమవుతోందా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: