ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ క్వీన్స్వీప్ చేయడం దాదాపు ఖరారైనట్టే. ఈ క్రమంలోనే వైసీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ కనీస పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇక వైసిపికి పట్టున ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో సరికొత్త రాజకీయ చరిత్ర ఆవిష్కృతం కానుంది. ఒంగోలు మున్సిపాలిటీగా ఆవిర్భవించి 144 సంవత్సరాలు.. ఇన్నేళ్లలో ఒక్కరంటే ఒక్క మహిళకు కూడా చైర్పర్సన్గా అవకాశం రాలేదు. ఒంగోలు నగర పాలక సంస్థగా ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తయింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఈ నె 23న ఒంగోలు మున్సిపాల్టీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి.
ఇక ఒంగోలు ముందు మున్సిపాల్టీగా మారి 144 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు కార్పొరేషన్ అయ్యాక ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఒంగోలు మేయర్ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించారు. ఒంగోలు నగర పాలక సంస్థలో మొత్తం 1,81,558 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 93,951 మంది కాగా, 87,573 మంది పురుషులు ఉన్నారు. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 6 వేల మంది ఎక్కకుగా ఉన్నారు. అందుకే మేయర్ పదవి మహిళలకు రిజర్వ్ చేశారు.
ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి బాలినేని ఒంగోలులో తిరుగులేని విధంగా వైసీపీ జెండా ఎగరవేయించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ అక్కడ పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. 144 సంవత్సరాల ఒంగోలు రాజకీయ చరిత్రలో ఆ నగర్ మేయర్గా తొలిసారి ఓ మహిళకు అవకాశం లభించడం.. అది కూడా వైసీపీకే చెందిన నాయకురాలికి ఆ ఛాన్స్ దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ మహిళా నేతల్లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది.
ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన నేపథ్యంలో ఎవరిని బరిలోకి దించాలన్న విషయమై ప్రధాన రాజకీయ పార్టీలు అన్వేషణ మొదలుపెట్టాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ మేయర్ పదవి కోసం ప్రధానంగా పోటీపడనున్నాయి. జనసేన, బీజేపీ కలిసి ఓ అభ్యర్థిని పోటీకి నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వామపక్షాలు కూడా ఉమ్మడిగా అభ్యర్థినిని నిలబెట్టే విషయమై చర్చిస్తున్నాయి. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా ఒంగోలు నగరంపై వైసీపీ జెండాయే ఎగరనుంది.