ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో వెంటనే తెలుగు తమ్మళ్లు గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు పార్టీ నుంచి పోటీ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దాదాపు సగానికి పైగా నియోజకవర్గాల్లో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తెలుగు తమ్ముళ్లు కాడి కింద పడేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా నెగ్గుకురావాలో తెలియక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు తలలు పట్టుకుంటుంటే.. మరో వైపు టిక్కెట్ల వివాదాలతో పార్టీలో అసంతృప్తి రగులుతోంది.
అసలే పార్టీ నుంచి పోటీ చేసేందుకు ముందుకు ఎవ్వరూ రావడం లేకపోవడం ఒక మైనస్ అయితే.. పోటీ చేసేందుకు ముందుకు వచ్చే వారి విషయంలో కూడా టిక్కెట్ల కోసం డబ్బులు అడుగుతున్నారన్న ఆరోపణలు మరింత కుంపట్లు రాజేస్తున్నాయి. తనకు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం టీడీపీ కార్యాలయం ఎదుట కార్యకర్త ఆర్కే రాజు ధర్నాకు దిగారు. ఇప్పటికే టీడీపీలో ఎస్సీలకు, బీసీలకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన రాజు బహిరంగంగానే ఈ విషయం లేవనెత్తారు. టీడీపీలో ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమా మహేశ్వర్ నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నిరసన తెలిపారు. ఉమామహేశ్వర నాయుడు గత ఎన్నికలకు ముందు కళ్యాణదుర్గంలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఆయనపై పార్టీ కేడర్ నుంచే వ్యక్తమవుతున్నాయి.
ఇక ఆందోళన చేస్తోన్న కార్యకర్త రాజును టీడీపీ నేతలు బలవంతంగా టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. ఆర్కే రాజు కళ్యాణదుర్గం మండలం నారాయణపురం ఎంపీటీసీ టిక్కెట్ ఆశించి భగ్గపడ్డారు. మరి ఈ అసంతృప్తులు ఇప్పుడు రాష్ట్రం అంతటా కనిపిస్తున్నాయి. దీనిపై పార్టీ అధినేత ఎలా స్పందిస్తారో ? చూడాలి.