ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలుగుదేశం పార్టీ కి షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీలో ఉండాలా ? వద్దా అని ఊగిసలాట ధోరణితో ఉన్న కీలక నేతలు అందరూ ఇప్పుడు ఆ పార్టీకి షాక్ ఇచ్చి వరుస పెట్టి ఫ్యాన్ పార్టీ కింద సేద తీరేందుకు రెడీ అవుతున్నారు. ఈ లిస్టులోనే ఈ రోజు ఇద్దరు మాజీ మంత్రులే చేరిపోయారు. కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాల్లో సుదీర్ఘకాలం నుంచి ఉన్న మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ విషయాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి చెప్పారని సమాచారం.
ఇక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇప్పటికే వైసీపీలో చేరారు. సోమవారం డొక్కా జగన్ సమక్షంలోనే వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే సైతం వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు విశాఖ జిల్లా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. 2014లో పల్లా ప్రజారాజ్యం పార్టీ నుంచి గంటా ద్వారా టీడీపీలోకి వచ్చి పోటీ చేసి ఓడిపోయారు.
ఇక గత ఎన్నికలకు ముందు పల్లా గాజువాకలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పైనే పోటీకి దిగారు. ఈ ఎన్నికల్లో పల్లా ఓడినా రెండో స్థానంలో ఉండగా... పవన్ ఏకంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పల్లాకు టీడీపీలో ప్రయార్టీ లేకపోవడం.. అయన్ను పట్టించుకునే నాథుడు లేకపోవడంతో పల్లా ఫ్యాన్ కిందకు చేరడానికి రంగం సిద్ధమైంది. వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ విజయ సాయిరెడ్డి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించగా ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక పల్లాతో పాటు మరి కొందరు టీడీపీ కీలక నేతలు కూడా పార్టీ కండువాలు కప్పుకునేందుకు సిద్ధమయ్యారట.