ఎస్ బ్యాంక్ సంక్షోభానికి రెండుకోట్ల పెయింటింగ్ కారణమా ?, బ్యాంక్ వ్యవస్థాకుడు రానాకపూర్ నివాసం లో తనిఖీలో భాగంగా లభించిన ఆ పెయింటింగ్ వల్లే ఎస్ బ్యాంక్ సంక్షోభం లో కూరుకుపోయిందా ?? అంటే అవుననే రీతిలో బీజేపీ నేతలు రాజకీయ విమర్శలు చేయడం హాట్ టాఫిక్ గా మారింది . రానాకపూర్ నివాసం లో లభించిన పెయింటింగ్ కు బీజేపీ నేతల విమర్శలకు లింక్ లేకపోలేదు . ఆ పెయింటింగ్ ను రానా కపూర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనయురాలు , పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నుంచి కొనుగోలు చేయడమే దానికి కారణం .
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వద్ద ప్రముఖ చిత్రకారుడు ఎం ఎఫ్ హుస్సేన్ చిత్రించిన పెయింటింగ్ ఒకటి ఉంది . అయితే ఆయన మరణానంతరం ఆ పెయింటింగ్ ప్రియాంక వద్దకు చేరింది . సదరు పెయింటింగ్ చూసిన రానా కపూర్ ముచ్చటపడి 2010 లో ప్రియాంక నుంచి రెండు కోట్లు చెల్లించి కొనుగోలు చేశాడు . ఇప్పుడా విషయాన్నీ బీజేపీ ఐటీ వింగ్ అంది పుచ్చుకుంది . ఎస్ బ్యాంక్ సంక్షోభం వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించింది . పెయింటింగ్ కొనుగోలు అనేది రానా కపూర్ వ్యక్తిగత వ్యవహారమని , ఒకవేళ దానికి బ్యాంక్ సొమ్ము వెచ్చిస్తే అది రానా కపూర్ చేసిన తప్పిదం అవుతుంది ... కానీ ఇందులో కాంగ్రెస్ పార్టీ కి సంబంధం ఎలా ఉందన్న చిన్న లాజిక్ ను బీజేపీ ఐటీ వింగ్ విస్మరించినట్లు కన్పిస్తోంది .
ఇక పోతే ఈ పెయింటింగ్ అమ్మకం , కొనుగోలు వ్యవహారాన్ని ప్రియాంక ఏమి దాచలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు అభిషేక్ మను సింగ్ , రన్ దీప్ సింగ్ సుర్జీవాలా తెలిపారు . ఈ విషయాన్నిఐటీ కి తెలియజేసిందని, ఎస్ బ్యాంక్ సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఈ తరహా ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు .