ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాలు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య బలంగా ఆధారంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయి . ఈ మేరకు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నల్గురు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది . అయితే ముగ్గురు అభ్యర్థుల ఎంపిక పై ఎవరికి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతోన్నరిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమళ్ నత్వాని, సభ్యత్వాన్ని కొనసాగించాలని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం పట్ల విమర్శలు వెల్లువెళ్త్తుతున్నాయి .
రాష్ట్ర ప్రయోజనాల కోసం నత్వాని ఎంతవరకు పని చేయగలరన్న ప్రశ్న తలెత్తుతోంది . గతం లో టీడీపీ నాయకత్వం కూడా మహారాష్ట్ర కు చెందిన సురేష్ ప్రభు ను రాష్ట్రం నుంచి రాజ్యసభ కు పంపింది . సురేష్ ప్రభు గత ఎన్డీఏ ప్రభుత్వ హయాం లో రైల్వే మంత్రిగా పని చేశారు . కానీ ఏనాడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు . రాష్ట్ర విభజన చట్టం లో ఇచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం రాష్ట్ర రాజ్యసభ సభ్యునిగా సురేష్ ప్రభు చేసిన కృషి శూన్యమనే చెప్పాలి . ఒక రాష్ట్రానికి చెందిన నేతలు మరొక రాష్ట్రం నుంచి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించడం అన్నది సర్వసాధారణ విషయమే అయినప్పటికీ , వారు ఎంతవరకు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తారన్న దానిపైనే వారి క్రెడిబిలిటీ ఆధారపడి ఉంటుంది .
ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభ కు ఎన్నికైన వారు ఆ రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా , కేవలం తమ వ్యక్తిగత, లేదంటే పార్టీ ఎజెండా తో ముందుకు వెళ్ళడమే ప్రస్తుతం అధికంగా కన్పిస్తోంది . నత్వాని కూడా అదేవిధంగా వ్యవహరిస్తే మాత్రం భవిష్యత్తు లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎదుర్కోక తప్పదు .