ఇప్పటికే వరుసగా రాంగ్ స్టెప్పులతో వరుసగా తన పరువు తానే తీసుకుంటోన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మరోసారి తన పరువు తానే తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతోన్న నేపథ్యంలో చాలా చోట్ల పార్టీ తరపున పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు లేకుండా పోతున్నారు. పలువురు కీలక నేతలు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ఏకంగా ఇద్దరు మాజీ మంత్రులు, ఓ మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి వెళ్లిపోయారు. గుంటూరు జిల్లాకు చెందిన డొక్కా మాణిక్య వరప్రసాదరావు వైసీపీలో చేరారు. ఇక కడప జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సైతం వైసీపీ బాటలోనే ఉన్నారు.
ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే రెహమాన్ సైతం వైసీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు మరో కామెడీ ఏంటంటే చంద్రబాబు పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసే దమ్ము లేదంటే బాబోరు ఏకంగా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని పోటీకి పెడుతున్నట్టు ప్రకటించారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకే తాము పోటీ చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో చూపించి ఓటు వేయాలని చంద్రబాబు అన్నారు. టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్యను బరిలోకి దింపుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.
ట్విస్ట్ ఏంటంటే టీడీపీ గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లే గెలుచుకుంది. అందులో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి ధర్రావు సైతం పార్టీకి దూరమయ్యారు. నాలుగు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఇది అందరికి తెలిసినా కూడా చంద్రబాబు రాజ్యసభ ఎన్నికలకు ఓ అభ్యర్థిని పోటీ పెట్టడం కామెడీ కాక మరేం అవుతుంది. పైగా ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యను పెట్టడం అంటే ఆయన రాజకీయ జీవితాన్ని అనవసరంగా బలి పశువును చేసినట్టే అవుతుంది.