స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే
టీడీపీ వెనుకడుగు వేస్తోందని, ఎన్నికలకు ముందే చంద్రబాబు చేతులెత్తేశారని వైస్సార్
పార్టీ తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా విమర్శించింది.
వైస్సార్సీపీ విడుదల చేసిన ప్రకటన సారాంశం క్రింది విధంగా ఉంది. చంద్రబాబు ఇప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు.
స్థానిక ఎన్నికలంటే చంద్రబాబు హడలి పోతున్నారు. వైయస్ఆర్సీపీ దూకుడుతో వెళ్తోంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైంది. టీడీపీకి మాత్రం లోకల్ వార్ చెమటలు పట్టిస్తోంది. సరైన అభ్యర్థులు దొరక్క ఆ
పార్టీ ఆపసోపాలు పడుతోంది. ఎంపీటీసీల పరిస్థితైతే మరింత దయనీయంగా ఉంది. క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు
టీడీపీ తరఫున పోటీ చేసేందుకు గ్రామాల్లో ముందుకు రావడం లేదు. ఓడిపోతామన్న భయం వారిని పట్టుకుంది. జెడ్పీటీసీల విషయంలోనైతే ఎక్కడా క్లారిటీ లేదు. ఇంతవరకు అభ్యర్థుల ఎంపికపై సమావేశం కావడం లేదంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. సమయం దగ్గరపడటంతో ఎవరో ఒకర్ని నిలబెట్టి మమ అనిపించేద్దామనే అభిప్రాయానికొచ్చేశారు.
టీడీపీ ఒకపక్క నీరసంతో కుదేలు కాగా, వైయస్ఆర్ సీపీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని భావిస్తున్నది. నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం ఒక ప్లస్ అయితే, ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందడం మరో ప్లస్గా నిలిచింది. ఇప్పుడెక్కడ చూసినా వైయస్ఆర్సీపీ తరపున పోటీ చేయాలన్న ఆత్రుతే కనబడుతున్నది. విజయం సాధిస్తామన్న ధీమాతో ఆశావహులు పోటీ పడుతున్నారు. అభ్యర్థుల ఎంపిక నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, ఇన్చార్జ్లకు అప్పగించడంతో ఆశావహుల తాకిడి మరింత ఎక్కువైంది. అయినప్పటికీ ఇన్నాళ్లూ
పార్టీ కోసం కష్టపడిన గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో అభ్యర్థుల ఎంపిక సులువైంది.
టీడీపీకి
స్థానిక ఎన్నికల భయం పట్టుకుంది. ఇటీవల చంద్రబాబు అనుసరిస్తున్న తీరు ఆ
పార్టీ నేతలకు శాపంగా మారింది. ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు.
అమరావతి ఒక్కటే ముద్దు అన్నారు. బీసీలకు వైయస్ జగన్ 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకోగా చంద్రబాబు తన మనిషి బిర్రు ప్రతాప్రెడ్డితో సుప్రీం కోర్టులో కేసు వేయించారు. ఎన్నికలే జరగకుండా మరికొన్ని సాకులతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కానీ ప్రభుత్వం ఎలాగైనా
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తీరాలని పట్టుదలతో ముందుకెళ్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్నికలు నిర్వహిస్తే
స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులొస్తాయి. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా
టీడీపీ ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు. ఎన్నికలకు వెళితే ఓడిపోతామన్న భయంతో జాప్యం చేస్తూ వచ్చింది. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు జరగడం, వైయస్ఆర్సీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్సీపీ
స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని మొదటి నుంచి ఆలోచిస్తూ వచ్చింది. కోర్టు చిక్కులను అధిగమించి ఎట్టకేలకు ఎన్నికలకు ముందుకెళ్లిందని
వైస్సార్సీపీ తెలియజేసింది.