ఏపీ సీఎం జగన్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తున్న జగన్ సర్కారు ఇప్పుడు పాఠశాలల గురించి మరో శుభవార్త వినిపిస్తున్నారు. ఏపీలో స్కూళ్లలో నాడు-నేడు వేగంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన కోసం ప్రతి పాఠశాలకూ ఓ స్మార్ట్ టీవీ అందజేయనున్నారు. దీని ద్వారా బోధన మరింత సులభతరం అవుతుందని అన్నారు. అంతే కాదు.. గోరుముద్ద మధ్యాహ్న భోజనంపై రూపొందించిన యాప్ సక్రమంగా పని చేస్తుందా లేదా అన్న విషయంపై సీఎం జగన్ అధికారులను ఆరా తీశారు. గోరుముద్దకు సంబంధించిన బిల్లులు పెండింగులో ఉండకూడదని జగన్ తెలిపారు.
మరో శుభవార్త ఏంటంటే.. జగనన్న విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు .. మూడు జతల యునిఫామ్స్, నోట్ పుస్తకాలు, షూ, సాక్స్, బెల్టు, బ్యాగు, టెక్ట్స్ బుక్స్ ఇవ్వబోతున్నారు. ఇవన్నీ ఓ కిట్ గా రూపొందించి అందజేస్తున్నారు. ఈ కానుకల మోడళ్లను అధికారులు సీఎంకు చూపించారు. యునిఫామ్స్, బెల్టు, బ్యాగుల నమూనాల గురించి అధికారులు సీఎంకు వివరించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే పాఠశాలలకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు డెడ్ లైన్ విధించారు. జగనన్న విద్యా కానుక స్కూళ్లు తెరిచేటప్పటికి పిల్లలకు అందించాలని జగన్ అధికారులతో అన్నారు. జూన్ నాటికి పాఠశాలలు ప్రారంభం అవుతాయి కాబట్టి పనులు పెండింగ్లో ఉండకూడదన్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గకూడదని, స్కూళ్లలో టాయిలెట్లు కూడా పరిశుభ్రంగా ఉండాలని జగన్ పేర్కొన్నారు.