మోసాలు ఎక్కడచూడు తరచుగా వినిపిస్తున్న మాటలు.. మోసమంటే వందల్లో కాదు. కోట్లల్లో జరుగుతున్నాయి.. ఒక రైతును నమ్మని బ్యాంకులు కార్పోరెట్ యజమానులను మాత్రం గుడ్డిగా నమ్మి వెలకోట్లు వారిచేతిలో పెట్టి మోసపోతున్నాయి.. ప్రజలు బ్యాంకులను నమ్మి తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో దాచుకుంటే ఆ సొమ్మంతా ఎవడో దోచుకుంటున్నాడు..
ఇకపోతే ఈ మధ్యకాలంలో యస్ బ్యాంక్ దివాల తీసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ యస్ బ్యాంక్ వ్యవస్ధాపకుడు రాణా కపూర్ ఢిల్లీలో తమకున్న రూ 1000 కోట్ల విలువైన ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పటికే రూ 4300 కోట్ల అనుమానిత లావాదేవీలు జరిగిన యస్ బ్యాంక్ వ్యవహారంలో, రాణా కపూర్ భార్య బిందూ కపూర్ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే..
అయితే దేశ రాజధానిలో తన భార్య బిందూ కపూర్ పేరిట ఉన్న మూడు విలాసవంతమైన భవనాలను విక్రయించేందుకు రాణా కపూర్ ప్రయత్నాలు చేశారని ఈడీ తెలిపింది.. అంతే కాకుండా రాణా కపూర్ తనపై ఈడీ దర్యాప్తు చేస్తుందన్న సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ, ముంబైలోని ఆస్తులను అమ్మి అమెరికా లేదా బ్రిటన్ లేదా ఫ్రాన్స్కు మకాం మార్చాలని ప్రయత్నించారని తెలిసింది.
దేశాన్ని విడిచేలోగా భారత్లో తనకున్న ఆస్తులను అన్నింటినీ విక్రయించాలన్నది ఆయన ఉద్దేశంగా అధికారులు తెలుపుతున్నారు.. ఇవే కాకుండా ఇతని గురించి దర్యాప్తూ చేస్తున్న కొద్ది రాణా కపూర్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి..
ఇకపోతే ఢిల్లీలో రాణా కపూర్కు చెందిన మూడు ఆస్తుల విలువ దాదాపు రూ 1000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఆస్తులన్ని అమ్మి దేశం విడిచి చెక్కేద్దామనుకుని ఈ ఆర్ధిక నేరగాడు చేసిన ప్రయత్నాలకు ఈడీ చెక్ పెట్టింది.