ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫీవర్ ప్రతి ఒక్కరిని ఊపేస్తోంది. బుధవారం సాయంత్రంతో ఎంపీటీసీలు, జడ్పిటిసిల నామినేషన్ల పర్వం ముగిసింది. గుంటూరు, నెల్లూరుతో పాటు కడప... కర్నూలు జిల్లాల్లో అధికార వైసిపి... విపక్ష టిడిపి నేతల మధ్య వార్ జరగడంతో కొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే వైసిపి సంస్థాగతంగా తిరుగులేని బలంగా ఉన్న నెల్లూరు జిల్లాలో నామినేషన్ల పర్వం లోనే సైకిల్ పార్టీ చేతులు ఎత్తేసింది. నెల్లూరు జిల్లాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలిచింది. నెల్లూరు ఎంపీ సీటుతో పాటు నెల్లూరు జిల్లాలో విస్తరించి ఉన్న తిరుపతి ఎంపీ సీటు సైతం వైసీపీ ఖాతాలోనే పడింది.
అసలు గత పదేళ్లుగా పార్టీ పెట్టినప్పటి నుంచే అక్కడ వైసీపీకి తిరుగులేదు. ఇక నామినేషన్లు ముగిసే టైంకే నెల్లూరు జిల్లాలో టీడీపీకి పెద్ద షాకులు తగిలాయి. నెల్లూరు జిల్లాలో పెళ్లకూరు మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయలేక టీడీపీ వాళ్లు చేతులు ఎత్తేశారు. దీంతో ఆ మండంలో 10 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో పడ్డాయి. పోటీ చేసినా ఎలాగూ ఓడిపోతామని డిసైడ్ అయిన తెలుగు తమ్మళ్లు అస్సలు నామినేషన్ వేసేందుకు కూడా ముందుకు రాలేదు.
ఇక ఇప్పుడు వైసీపీ అభ్యర్థులతో పాటు వైసీపీ డమ్మీ అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. వీళ్లు రేపో, ఎల్లుండో నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఈ టీసీలు అన్నీ వైసీపీ ఖాతాలో ఎన్నికలు లేకుండానే పడినట్లవుతుంది. ఇక ఇదే జిల్లాలోని సర్వేపల్లి, ఉదయగిరి, నెల్లూరు రూరల్ మండలాల్లో పలు ఎంపీటీసీ స్థానాలకు కూడా నామినేషన్లు వేయకుండా టీడీపీ వాళ్లు చేతులు ఎత్తేశారు. ఇవన్నీ చూస్తుంటే జిల్లాలో టీడీపీ దయనీయ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక రాయలసమీలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.