మొన్నటి వరకు చైనాను వణికించిన కరోనా(కోవిడ్ 19) ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎక్కడ చూసినా కరోనా ముచ్చటే నడుస్తుంది. భారత్ లో కూడా కరోనా వైరస్ బాధితులు 70 కి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా కేరళాలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తొలిసారిగా కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి తిరిగొచ్చిన నెల్లూరు యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ లేదని చెబుతున్నప్పటికీ విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కరోనా సోకినట్లు చెబుతున్నారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో చేరిన ఓ వ్యక్తికి వైద్యపరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి కొన్నిరోజుల క్రితమే ఇటలీ నుంచి నెల్లూరు వచ్చారు.
ఇటలీలో ఎంబీబీఎస్ చదువుతున్న సదరు యువకుడు ఇటీవలే అక్కడి నుంచి నెల్లూరు వచ్చాడు. గత 14 రోజులుగా ఆ యువకుడు ప్రభుత్వ హస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతడు కలిసిన వారిని కూడా హాస్పిటల్లో క్వారంటైన్లో ఉంచారు. కాగా, చైనా తర్వాత ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఏపికి కరోనా సోకిందని తెలియగానే జనాలు ఉలిక్కి పడుతున్నారు.
భారత దేశంలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ కేసుల సంఖ్య 73 దాటింది. వీరిలో 56 మంది భారతీయులు కాగా.. 17 మంది విదేశీయులు ఉన్నారు. కాగా, నెల్లురి వాసికి జ్వరం, జలుబు, దగ్గు తదితర కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండడంతో అతడిని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ఆ వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి తిరుపతిలోని స్విమ్స్ వైరాలజీ ల్యాబ్ కు పంపగా, కరోనా సోకినట్టు తేలింది. తాాజాగా నెల్లూరు వ్యక్తికి కూడా ఇటలీలోనే కరోనా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.