తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి స్వపక్షం లోనే విపక్షం ఉన్నట్లయింది . రేవంత్ వ్యవహారశైలి ని సొంత పార్టీ నేతలే తీవ్రంగా తప్పుపడుతున్నారు . జీవో 111 పై రేవంత్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని వారు మండిపడుతున్నారు . ప్రస్తుతం రేవంత్ ను అధికార పార్టీ నేతలకంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలే విమర్శిస్తుండడం హాట్ టాఫిక్ గా మారింది . సామాజిక మాధ్యమాల వేదిక గా రేవంత్ అనుచరులు చేస్తున్న హడావుడిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయి లో మండిపడ్డారు . మాజీమంత్రి శ్రీధర్ బాబు టీఆరెస్ లో చేరుతున్నారని , రేవంత్ అనుచరులే తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు .
రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు కాంగ్రెస్ పరువు తీస్తున్నారని విరుచుకుపడ్డారు . ఈ ప్రచారాన్ని ఆపకపోతే సహించేది లేదని హెచ్చరించారు . రేవంత్ రెడ్డి కాబోయే సీఎం ... పీసీసీ అధ్యక్షుడని ఊదరగొడుతున్నారని ఆయనకంత సీన్ లేదని జగ్గారెడ్డి అన్నారు . రేవంత్ ఏమి తీస్మార్ ఖాన్ కాదని , అంతటి తీస్మార్ ఖానే అయితే టీడీపీ లోనే ఉండి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించారు . రేవంత్ నిజంగా మగాడే అయితే టీడీపీలోనే ఉండి చేసుకునే వాడని , కాంగ్రెస్ లో చేరి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడని మండిపడ్డారు .
తనకు సీఎం కావాలని , పీసీసీ అధ్యక్షుడు కావాలని ఉందని జగ్గారెడ్డి అన్నారు . కాంగ్రెస్ పార్టీ లో ఉన్న అందరికీ పీసీసీ అధ్యక్షుడు కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఉంటుందని , కానీ అది డిసైడ్ చేసేది సోనియాగాంధీ , రాహుల్ గాంధీ అని జగ్గారెడ్డి చెప్పారు . రేవంత్ వ్యవహారశైలిని ఒక్క జగ్గారెడ్డి కాదు ... కాంగ్రెస్ సీనియర్ నేత , రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హన్మంతరావు , మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా తప్పుపట్టారు .