స్ధానిక సంస్ధల ఎన్నికల వేడి పెరిగిపోతుంటే మిత్రపక్షాలైప బిజెపి-జనసేనల్లో ఏమి జరుగుతోందో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. వైసిపికి గట్టిపోటి ఇస్తామంటూ రెండు పార్టీల నేతలు గంభీరంగా ప్రకటించిన విషయం అందరూ చూసిందే. ప్రకటన అయితే చేశారు కానీ క్షేత్రస్ధాయిలో అందుకు తగ్గ ప్రయత్నాలు మాత్రం ఎక్కడా కనబడటం లేదు.   ఈ విషయంలోనే మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేసేయాలని కమలం పార్టీ నేతల్లో పెద్దగా ఆసక్తి కనబడటం లేదు. అందుకనే వాళ్ళు ఎన్నికలను  లైట్ గా తీసుకున్నట్లుంది చూస్తుంటే. అదే సమయంలో జనసేనలో పోటి చేయాలన్న ఆసక్తి ఉన్నా సరైన దిశా నిర్దేశం చేసే వాళ్ళే కనబడటం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకూ పార్టీలో ఏ స్ధాయిలో కూడా కార్యవర్గమే ఏర్పాటు కాలేదు.

 

గ్రామస్ధాయి నుండి ఎక్కడ కూడా కార్యవర్గం లేకపోవటంతో పోటి విషయంలో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరిని  కలవాలనే విషయంలో క్లారిటి లేదట. పైగా ఎన్నికల వ్యవహారం మొత్తం నాదెండ్ల మనోహర్ మీదే వేసేసి అధినేత పవన్ కల్యాన్ చేతులు దులిపేసుకున్నాడు. దాంతో బిజెపితో చర్చలు, సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపిక తదితరాలన్నింటినీ ఒకడే చేయాల్సొస్తోంది. దీని వల్ల నాదెండ్ల మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది.

 

ఏదో వైసిపిని వ్యతిరేకించాలని, జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లాలనే యావ తప్ప రెండు పార్టీల నేతల్లోనే ఇంకో అజెండా ఉన్నట్లు కనబడటం లేదు. తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో జనసేన నేతలు టిడిపి, సిపిఐ నేతలతో కలిసి పోటి చేస్తున్నారు. కొన్నిచోట్లేమో టిడిపి+జనసేన పోటి చేస్తుండగా మరికొన్ని చోట్ల జనసేన+టిడిపి+సిపిఐ కలిసి పోటి చేస్తున్నాయి. సహజంగానే ఈ విషయంలో బిజెపి నేతలు మండిపోతున్నారు.

 

ఒకవైపు తమతో పొత్తులో ఉంటూనే మరోవైపు అక్కడక్కడ జనసేన వర్గాలు టిడిపితో కలవాటన్ని కమలంపార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. కానీ వీళ్ళు చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే జనసేనకు అవసరమైన సహకారం అందిస్తే వీళ్ళు టిడిపి, సిపిఐ వైపు ఎందుకు చూస్తారు ?  అందుకనే రెండు పార్టీల మధ్య ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటంలేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: