ఏపీ స్థానిక ఎన్నికల బ్యాలెట్ పత్రంపై కరోనా వైరస్ ఏంటని అవాక్కవుతున్నారా... కానీ మీరు చదివింది నిజమే.. ఏపీ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందనేది నిపుణుల సందేహం. బ్యాలెట్ పత్రాలు వివిధ చేతులు మారే అవకాశం ఉన్నందున, ఎవరన్నా ఒక రోగి చేతిలోకి చేరిన బ్యాలెట్ ద్వారా ఇతరులకు ఈ వైరస్ సోకే అవకాశం లేకపోలేదు అంటున్నారు. ఇక ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 1,36,895 కేసులు నమోదు, 5077 మరణాలు జరిగాయి. ఇక మన దేశంలో కూడా 81 కేసులు నమోదు అవడంతో పాటు 2 మరణాలు సంభవించాయి.
అందువలన ఆరోగ్యశాఖవారు వీలైనన్ని జాగ్రత్తులు తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు. జనాల్లో కూడా పెను మార్పులే వచ్చాయి. ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేశారు. దండం పెట్టడానికే మొగ్గు చూపుతున్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల రంగానికి సర్వత్రా సన్నద్ధమైన సమయంలో కరోనా భయం వీరిని కూడా ముప్పు తిప్పలు పెడుతోంది. ఈజీగా తీసుకోవడానికి లేదు ఎందుకంటే, వైరస్ ప్రభావం ఎప్పుడు ఎక్కడ, ఎలా ఉంటుందో నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు.
తాజాగా కరోనా కేసులు ఏపీలో కూడా వ్యాపించాయి. దీంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ఈ విషయంలో అప్ డేటెడ్ గా వుంటున్నారు. ఐపీఎల్, ఒలింపిక్స్ లాంటి క్రీడలను వాయిదా వేస్తున్నారు.. మరోవైపు కర్ణాటకలో వారం రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సెలవలు ప్రకటించేసిన విషయం తెలిసినదే. ఇకపోతే, కరోనా వైరస్ ఏ ఉపరితలంపై ఎంత సేపు జీవించగలదు అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్, ప్రిన్స్టన్ వర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (హామిల్టన్), సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వంటి విద్యాసంస్థల్లో శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి ఈ కింది విషయాన్ని చెప్పారు.
పేపర్లపై కరోనా వైరస్ ఏకంగా 5 రోజుల పాటు బతికేస్తుందట. గాలిలో కరోనా వైరస్ 3 గంటల సమయం పాటు బతికి ఉండగలదట. అందుకే మనవాళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థ ఎన్నికలు మార్చి 21, 23, 27,29 తేదీల్లో నిర్వహించనున్నారు. పైగా ఎన్నికల్లో బ్యాటెట్ పత్రం ద్వారా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దీంతో బ్యాలెట్ పత్రం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే వీలు ఉందని నిపుణులు సూచించారట..