ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చేసింది. మొత్తం 13 జిల్లాల్లో చాలా చోట్ల అసలు వైసీపీ నుంచి పోటీ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇప్పటికే నామినేషన్ల పర్వంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాథినిత్యం వహిస్తోన్న పుంగనూరు, విప్ పిన్మెల్లి రామకృష్ణా రెడ్డి ప్రాథినిత్యం వహిస్తోన్న మాచర్ల నియోజకవర్గంలోనూ టీడీపీ వాళ్లు నామినేషన్ వేసేందుకు కూడా సాహసించలేదు. పోటీ చేసినా ఎలాగూ చిత్తుగా ఓడిపోతామని డిసైడ్ అయ్యి నామినేషన్లు వేయకపోవడంతో మాచర్ల మున్సిపాల్టీ ఏకగ్రీవమైంది.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోనూ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది. పెద్దిరెడ్డి పుంగనూరు మున్సిపాల్టీతో పాటు చిత్తూరు, తిరుపతి నగర కార్పొరేషన్లలో పలువార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇక ఏదో నామ్ కే వాస్తేగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయే తప్పా ఈ మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఇప్పటికే వైసీపీ ఖాతాలో పడినట్లే అయ్యింది. ఇక జగన్ సొంత జిల్లా అయిన కడపలో కూడా చాలా చోట్ల టీడీపీ తరపున పోటీ చేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు.
ఇక కడప జిల్లాలో కీలకమైన పులివెందుల, జమ్మలమడుగు మున్సిపాల్టీల్లో టీడీపీ తరపున నామినేషన్ వేసేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. దీంతో ఈ రెండు మున్సిపాల్టీలు వైసీపీ ఖాతాలో ఏకగ్రీవం కానున్నాయి. జగన్ సొంత నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో సతీష్రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడంతో అక్కడ టీడీపీకి సరైన నాయకుడే లేడు. ఇక జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం... మరో మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి వైసీపీలో చేరడంతో జమ్మలమడుగులోనూ టీడీపీకి నాయకుడు లేడు. ఇక అదే జిల్లాలోని ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్చార్జ్ మార్పుతో అక్కడ కూడా అదే పరిస్థితి ఉంది.