ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టి పోటీకి దిగినా కూడా జనసేన తరపున పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కీలకమైన ఉత్తరాంధ్రలో విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో అసలు ఈ కూటమి పోటీలో లేదు. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకే పోటీ చేసేందుకు చాలా చోట్ల అభ్యర్థులు లేని పరిస్థితి. ఈ లెక్కన జనసేన గురించి ఏ నాథుడు పట్టించుకుంటాడు. ఇక తాజాగా జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు సైతం పార్టీకి దూరమై జగన్కు దగ్గరవుతోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే శనివారం జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాజమండ్రిలో జరిగిన సభలో పవన్ ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉంటుందన్నారు. జనసేనకు ఓట్లేయకపోయినా ప్రజల పక్షాన జనసేన ఉంటుందన్నారు. తనకు అధికారం సాధించాలన్న కోరిక లేదని.. తాను ఎప్పుడూ ధైర్యంగానే పోరాటం చేస్తానని.. తనకు పిరికితనమంటే తెలియదన్నారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులపై స్పందించిన పవన్ క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలాగానే ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయకపోవడం దారుణమన్నారు. ఇక తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావు గురించి మాట్లాడుతూ జనసేన కు ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నారని, ఆయన పార్టీలో ఉన్నారా? లేదా? అన్న విషయం ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నానని పవన్ తెలిపారు. ఇక రాపాక వర ప్రసాదరావు ఇప్పటికే పవన్ బలంతో తాను గెలవలేదని.. తన సొంత బలంతోనే గెలిచానని.. పవన్కు బలం ఉంటే ఆయన రెండు చోట్ల ఎందుకు ఓడిపోతారని తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాపాక అసెంబ్లీలోనూ.. అసెంబ్లీ బయట కూడా జగన్ నామస్మరణ చేస్తోన్న సంగతి తెలిసిందే.