ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వరుస షాకులతో విలవిల్లాడుతోన్న విపక్ష టీడీపీకి శనివారం మరో అదిరిపోయే రెండు షాకులు తగిలాయి. ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరిలో వైసీపీ కంచుకోట అయిన రాయలసీమలోని కర్నూల్ జిల్లా నందికొట్కూరులో టీడీపీకి షాక్ తగిలింది. నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య వైసీపీలో చేరారు. ఐజయ్య గతంలో వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి జంప్ చేశారు. ఇప్పుడు ఆ పార్టీలో లైఫ్ లేకపోవడంతో తిరిగి వైసీపీ గూటికి చేరిపోయారు.
వైసీపీ రాయలసీమ రీజినల్ కోఅఆర్టినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మంత్రి అనిల్కుమార్ యాదవ్, నందికొట్కూరు వైసీపీ ఇంచార్జ్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఐజయ్యతో పాటు పలువురు టీడీపీ మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక ఉత్తరాంధ్రలోని విశాఖ నగరంలో టీడీపీకి అదిరిపోయే షాక్ తగిలింది. ఎలాగైనా గ్రేటర్ విశాఖపై వైసీపీ జెండా ఎగర వేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డిని విజయ సాయి వైసీపీలో చేర్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గురుమూర్తి రెడ్డి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. ఇక ఇదే విశాఖలోని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఇప్పటికే వైసీపీలో చేరిపోగా... గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు సైతం వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ జోరు చూస్తుంటే ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పూర్తిగా కనుమరుగు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు టీడీపీకి కేడర్ అయినా మిగులుతుందా ? లేదా ? వాళ్లు కూడా జారి పోతారా ? అన్న ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి.