ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలను హడలెత్తిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం ఇప్పుడు పలు కీలక దేశాలపై తీవ్రంగా పడింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్ప కూలిపోతున్నాయి. ఇక ఇప్పుడు మన దేశంలో కూడా కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో కరోనా వైరస్ 85 మందికి సోకినట్టు లెక్కలు చెపుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది కరోనా అనుమానితులు రోజు రోజుకు బయటకు వస్తున్నారు. ఏపీలో కరోనా ప్రభావం పెద్దగా లేకపోయినా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా అనుమానితులు ఎక్కువుగా ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక చర్యలు తీసుకుంటోంది.
అయితే దీనిపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. మీడియా ఛానెల్స్ అదే పనిగా కరోనా గురించి రకరకాల వార్తలు చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నాయి. దీనిపై కేసీఆర్ శనివారం అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. కరోనా గురించి అనవసర భయం వద్దని... ఇక దీనిపై ఎవ్వరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదని... మొత్తం దేశంలో ఉన్న 135 కోట్ల మంది జనాభాలో ఈ వ్యాధి ఇప్పటి వరకు కేవలం 65 మందికి సోకగా.. వీరిలో ఇద్దరు మాత్రమే చనిపోయారి అన్నారు.
ఇక తాము ఈ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు చాలా చర్యలు తీసుకుంటున్నామని.. వికారాబాద్ హరిత రిసార్ట్స్లో ఉన్న రూములతో పాటు ఇక దూలపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న రూములను కూడా అధికారులు టేకోవర్ చేసుకున్నారని కేసీఆర్ చెప్పారు. ఇక 11 రోజుల పాటు ఆరోగ్య శాఖా మంత్రి గారు నాకు కూడ అందుబాటులో లేకుండా పని చేస్తున్నారని... 200 మంది వైద్య ఆరోగ్య శాఖా సిబ్బంది 24 గంటలు ఎయిర్ పోర్టులో ఉంటూ పని చేస్తున్నారని అన్నారు. అయితే కొన్ని చిల్లర టీవీలు లేనిపోనా వార్తలు కరోనాపై ప్రచారం చేస్తూ ప్రజల్లో లేనిపోని అపోహలు ప్రచారం చేస్తున్నాయంటూ కేసీఆర్ మండిపడ్డారు.