భార్య‌ను అత్యంత కిరాత‌కంగా చంపి జైలుపాయ్యాడు. ఇటీవ‌లే బెయిల్‌పై విడుద‌లై మ‌ళ్లీ త‌న పాడుబుద్ధిని చూపించి ప్రాణాల‌మీదికి తెచ్చుకున్నాడు. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. ఆ వివ‌రాలేమిటో చూద్దాం.. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లం కేశ‌వ‌పురం శివారు ఎర్ర‌కుంట తండాకు చెందిన భూక్య సోమ‌న్న‌(45), కొడ‌కండ్ల మండ‌లం రేగులతండాకు చెందిన గుగులోత్ చంద్రు కుమార్తె శార‌ద‌కు సుమారు 16ఏళ్ల క్రితం వివాహ‌మైంది. వారికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. బ‌తుకుదెరువు కోసం హైద‌రాబాద్‌కు వెళ్లారు. కుషాగూడ‌లోని నివాసం ఉంటూ ఏదో ఒక ప‌నిచేసుకుంటూ జీవించారు. ఈ క్ర‌మంలో మూడు నెల‌ల క్రితం సోమ‌న్న త‌న భార్య శార‌ద‌ను కిరాతకంగా హ‌త్య చేశాడు. పోలీసులు అత‌న్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఇటీవ‌లే బెయిల్‌పై విడుద‌ల అయ్యాడు. ఈ క్ర‌మంలో ఈ నెల 14(శ‌నివారం)న మ‌ధ్యాహ్నం  అత్త‌గారిల్లు అయిన రేగుల‌తండాకు వ‌చ్చాడు. కాగా, సోమ‌న్న‌కు న‌లుగురు బామ్మ‌ర్దులు.

 

 ఇందులో ఓ  బామ్మ‌ర్ది బిడ్డ‌ను త‌న‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌ని సోమ‌న్న‌ అడిగాడు. ఈ క్ర‌మంలో వారి మ‌ధ్య మాటామాటా పెరిగింది. దీంతో కోపంతో ర‌గిలిపోయిన బామ్మ‌ర్దులు బావ సోమ‌న్న‌ను చిత‌క‌బాదారు. ఈ దెబ్బ‌ల‌కు త‌ట్టుకోలేక సోమ‌న్న అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దిలాడు. ఆ త‌ర్వాత ఎవ‌రికీ అనుమానం రాకుండా.. స‌మీపంలోని తుమ్మ‌చెట్టుకుని ఉరివేసుకుని సోమ‌న్న చ‌నిపోయిన‌ట్లుగా చిత్రీక‌రించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ విష‌యం కాస్త పోలీసులకు తెలియ‌డంతో వెంట‌నే రంగంలోకి దిగారు. పోలీసుల‌ విచార‌ణ‌లో బామ్మ‌ర్దులు చంపిన‌ట్లు తేలింది. ఈ మేర‌కు పోలీసులు వెంట‌నే కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. తండావాసులు భ‌యంతో వ‌ణికిపోయారు. అయితే, సోద‌రిని హ‌త్య చేసినా.. పిల్ల‌ల మొఖం చూసి సోమ‌న్న‌ను అప్పుడు బామ్మ‌ర్దులు వ‌దిలేశార‌ని, పాడుబుద్ధి చూపించి, చివ‌రికి బామ్మ‌ర్దుల చేతిలోనే ప్రాణాలు వ‌దిలాడ‌ని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: