రెండు అక్షరాల ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు. ప్రేమ ఏడిపించినంతగా ప్రపంచంలో ఏదీ ఏడిపించదు అయినా ఎందుకో తెలియదుగానీ.. ఆ ప్రేమనే ప్రేమిస్తాం. ప్రాణంగా ప్రేమిస్తే ఎలా మోసం చేయాలనిపిస్తుంది. నాకేం సంబంధం అని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా? తీరాన్ని చేరడం ఎంత కష్టం...' అంటూ మదన పడిపోతారు కొందరు. అయితే ప్రేమలో ఓడిపోవడం ఎవరికైనా సహజమే. కానీ.. అంతకంటే విలువైనది జీవితమనే విషయాన్ని మరవకూడదు. అయినా ప్రేమలో ఓడిపోవడం అంటే.. ఆగిపోవడం అస్సల కాదు. మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే అని అనుకోవాలి. మరియు మోసం చేసిన వారికి ఎలా బుద్ధి చెప్పాలి అనే సహసం చేయడం మరింత గొప్ప విషయం.
ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఓ మహిళను ప్రేమించిన వైసీపీ నాయకుడి పుత్రరత్నం, పెళ్లి విషయాన్ని ఎత్తేసరికి మోసం చేశాడు. అయితే అక్కడితో ఆగిపోకుండా, కృంగిపోకుండా సదరు మహిళా ప్రియుడి మోసానికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే సదరు మహిళ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేసి వినూత్నంగా నిరసన తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమలాపురం మునిసిపాలిటీలో కీలక నేతగా ఉన్న ఓ వ్యక్తి కుమారుడు తనను ప్రేమించాడని, పెళ్లికి మాత్రం నిరాకరించాడని సూర్యనగర్ ప్రాంతానికి చెందిన బైరుశెట్టి రేణుక ఆరోపించింది.
ఈ విషయాన్ని పెద్దలు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా తనకు న్యాయం జరగలేదని రేణుక వాపోయింది. తన తల్లి ధనలక్ష్మితో కలిసి వచ్చి, సదరు నేత కుమారుడు బరిలోకి దిగిన 15వ వార్డులో స్వతంత్ర అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేసింది. ఇంటింటికీ తిరిగి, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రచారం చేస్తానని ఆమె వెల్లడించింది. ఇక రేణుక ఎంబీఏ చదివిన విద్యావంతురాలు కావడంతో పోటీలో ఉన్న ప్రియుడు కూడా ఆందోళన చెందుతున్నారట. రేణుక మాత్రం గడపగడపకూ తిరిగి తన ప్రియుడికి బుద్ధి చెప్పి తీరుతానని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో అక్కడ హాట్ టాపిక్గా మరింది.