ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను ఏకంగా ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను వాయిదా వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్ గవర్నర్ను కలిసి ఏపీ ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇక అదే టైంలో చంద్రబాబు తొత్తుగా ఆయన కులానికి చెందిన నిమ్మగడ్డ తీరు ఉందని కూడా ఫైర్ అయ్యారు.
జగన్ ప్రెస్మీట్ అయిన వెంటనే ప్రెస్మీట్ పెట్టిన చంద్రబాబు జగన్ మాటలను కౌంటర్ చేస్తూ విమర్శలు చేశారు. జగన్ పోలీసులను దగ్గర పెట్టుకుని మరీ ఎన్నికల్లో దుర్మార్గాలకు తమ పార్టీ కార్యకర్తలు తెగబడేలా ప్రోత్సహించారని. పైగా జగన్ పోలీసులను మెచ్చుకుంటారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రం అంతా అరాచకాలతో అల్లకల్లోలం చేస్తూ చిన్న చిన్న గొడవలు అంటారా ? అని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎంతో మందిని కరోనా కబలిస్తోందని.. దేశంలో ఏకంగా 70 శాతం మందికి కరోనా సోకుతుందని జర్మనీ దేశం భయపడుతోందని.. చివరకు ఈసీని కూడా బెదిరించే స్థాయికి వచ్చారని చంద్రబాబు కోపం పట్టలేకపోయారు.
చివరకు పోలీసులు వైసీపీ తొత్తులుగా మారి టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పత్రాలు లాక్కు వెళ్లడంతో పాటు బైండోవర్ కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారని బాబు ఫైర్ అయ్యారు. సామాజిక వర్గాల పేరుతో విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరోనా వైరస్ను నోటిఫై డిజార్డర్గా కేంద్రం ప్రకటించిందని... జగన్కు ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమా ? అని విమర్శించారు. జగన్ పార్టీ నాయకులు బెదిరించి 22 శాతం ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసుకున్నారని మండిపడ్డారు.