కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 6 వారాల పాటు స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై రాజ‌కీయ పార్టీలు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నాయి. అయితే, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరంలో మీడియాతో  మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హింసాత్మకంగా జరిగిన నామినేషన్ ప్రక్రియను సైతం రద్దు చేసి తిరిగి చేపట్టాలని కోరారు. అయితే, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గురించి ఆయ‌న సొంత జిల్లా చిత్తూరు గురించి ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

 

``స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడటం రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి కొమ్ముకాసే విధంగా ప్రవర్తించడం బాధాకరం. పాలన విభాగంలో తప్పులు జరిగితే సరిదిద్దాల్సిన అధికారులు... తమ కళ్లెదుటే ఇన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతుంటే చేతులు కట్టుకొని చూశారు. ప్రభుత్వంతో ఏకమై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. నిన్న మూడు గంటలతో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయితే... రాత్రి పది గంటల వరకు పోలీసుల సాయంతో ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్ధులను బెదిరించి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా చేశారు.`` అని ప‌వ‌న్ అన్నారు.
 


``ఏదైనా ప్రాంతంలో అభ్యర్ధిపై దాడులు జరిగితే అక్కడ ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలి. జనసేన అభ్యర్ధులు, వారితోపాటు నామినేషన్ వేయడానికి వెళ్లిన నాయకులపై దాడులు జరిగితే అసలు ఏమీ జరగనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో నామినేషన్ వేయాలంటే భయపడే పరిస్థితి దాపురించింది`` అంటూ చంద్ర‌బాబు సొంత జిల్లాపై ప‌వ‌న్ ప్ర‌త్యేక దృష్టిని పెట్టారు.

 

``అధికారులు ఎవరెవరూ ఏ స్థాయిలో వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాచారో నివేదిక తయారు చేస్తున్నాం. దానిని త్వరలోనే ప్రజలకు విడుదల చేస్తాం. వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ఈ రోజు మీరు రెచ్చిపోవచ్చు ... భవిష్యత్తులో మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయిస్తాం. హింసాత్మక సంఘటలపై అన్ని ఆధారాలు సేకరించి కేంద్ర హోం శాఖ, కేంద్ర ఎన్నికల సంఘానికి  లేఖలు రాయడంతో పాటు.. నివేదికను  పట్టుకొని స్వయంగా నేనే ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేస్తా. రౌడీలు మదబలంతో రాజ్యమేలుతామంటే చూస్తే ఉరుకోం. ఎదురు తిరుగుతాం`` అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: