మహమ్మారి కరోనా ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు భారత్లో కూడా పెరుగుతున్నాయి. దేశంలో ఆదివారం మధ్యాహ్నం వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 107కు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా 14 మందికి వైరస్ సోకడంతో భారత్లో కరోనా కేసులు 107కు చేరింది. కొత్తగా వ్యాధి బారిన పడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
యూరపియన్ దేశమైన స్పెయిన్లో సాక్షాత్తూ ఆ దేశ మంత్రి ఇరేనే మాంటెరో కరోనా సోకడంతో భయాందోళన నెలకొంది. స్పెయిన్ ప్రధాని భార్య బిగోనా గామ్జేకు కరోనా సోకినట్లు నిర్థారించారు. గత 24 గంటల్లో 1500 కేసులు నమోదుకాగా, ఇప్పటివరకు 5 వేల 753 కేసులు నమోదు అయ్యాయి. నమోదైన కేసుల్లో 3 వేల కేసులు రాజధాని మాడ్రిడ్ లోనే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనాతో 120 మంది మృతిచెందినట్లు ఆదేశ ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు వారాలపాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించడం అక్కడి పరిస్థితికి నిదర్శనం.
మరోవైపు, ఇటలీలోని మిలన్ నుంచి ప్రత్యేక విమానంలో భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. ఇరాన్, ఇటలీలో చిక్కుకున్న భారతీయులను కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకువచ్చింది. వచ్చిన వారిలో 211 మంది విద్యార్థులు ఉండగా..ఇందులో ఏడు కరోనా అనుమానిత కేసులు ఉన్నాయి. వారికోసం ప్రత్యేకంగా 50 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. విమానంలో ఉన్నంత సేపు ప్రయాణికులు ఒకరికొకరు మాట్లాడుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విమానం నుంచి దిగిన వారిని ప్రత్యేక బస్సుల్లో ఐటీబీటీ సరిహద్దు క్వారటైన్ కు తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని వారి సొంత ప్రాంతాలకు తరలిస్తారు. కాగా, వీరికి నెగటివ్ వస్తే, సొంత ప్రాంతాలకు తరలించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.