మనిషి అనేవాడు మచ్చుకైనా కనపడటం లేదే అన్నట్లు అయిపోయింది సమాజం. ఎటు చూసినా స్వార్ధం..ఎటు చూసినా అన్యాయం.. మంచి తనం అనేది ఎక్కడా కనపడటం లేదు. అంతా అన్యాయమే ప్రతిదీ కమర్షియలే... అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. ఆడ, మగ బంధాలు బంధుత్వాలు అసలు ఇవేమి ఆలోచించడం లేదు. కేవలం డబ్బులే ప్రధానంగా జీవిస్తున్నారు కొంత మంది మూర్ఖులు. ఇక వాటి కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతున్నారు. మానవతా విలువలను కోల్పోయి డబ్బుకోసం ఎంతటి నీచమైన పనికైనా సిద్ధపడిపోతున్నారు. ఇలాంటి దారుణ ఘటనే ఒకటి బెంగుళూరులో చోటు చేసుకుంది. కొన్ని సామెతలు ఊరికే పుట్టుకురావు అలాంటి పరిస్థితులు నెలకొంటే తప్పించి అన్నట్లు ఉంటాయి కొన్ని సంఘటనలు. అదేంటి అనుకుంటున్నారా ఆడదానికి ఆడదే శత్రువన్న సామెత ఊరికేపుట్టుకురాలేదన్న విషయం మీకు ఈ సంఘటన గురించి వింటే తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే... బెంగళూరుకి చెందిన భార్యభర్తలకు పెళ్లై చాలా కాలమైనా పిల్లలు మాత్రం లేరు. కానీ ఏ ఆడదైనా అమ్మతనం కోరుకుంటుంది. దీంతో పిల్లలు పుట్టే భాగ్యం లేదని బాధపడుతున్న ఆమె ఎలాగైనా తల్లిని కావాలంటూ వైద్యులను సంప్రదించింది. అందుకు వైద్యులు ఆమెకు సరోగసీ విధానాన్ని సూచించారు. దాంతో దంపతుల నుంచి జన్యువులను సేకరించి వేరొకరి కడుపులో బిడ్డను పెంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకోసం మరో మహిళను డబ్బులకు బేరం కుదిరింది. ఆ మహిళ పాపం డబ్బులు లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుండడంతో తన కడుపులో పిండాన్ని మోసి కని ఇచ్చేందుకు అంగీకరించింది. ఫెర్టిలిటీ సెంటర్లో నమోదు చేసుకున్న సరోగసీ మదర్ వారి సంరక్షణలోనే ఉంటోంది.
బిడ్డను కనిచ్చేందుకు అంగీకరించిన సరోగసీ మదర్ను ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులే ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్గా ఆశ్రయం కల్పించారు. ఇక ఆమె సంరక్షణ బాధ్యతలు చూసుకునేందుకు కేర్టేకర్లను నియమించారు. ఆమెకి క్రమం తప్పకుండా ఆహారం, వైద్య పరీక్షలు అన్నీ చేస్తూ ఆమెను జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇక డబ్బుల కోసం బిడ్డను కనిచ్చేందుకు అంగీకరించిందని తెలుసుకున్న కొంత మంది మహిళా ముఠా ఆ మహిళా సంఘాల ముసుగులో సరోగసీ మదర్ని బెదిరించడం మొదలుపెట్టింది. బిడ్డని కడుపులో మోసి ప్రసవించి ఇచ్చినందుకు దంపతులు ఇస్తామన్న డబ్బులో వాళ్ళకి కూడా ఎంతోకొంత వాటా కావాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఓ సారి తాను ఉంటున్న నివాసానికి వచ్చి బెదిరించి వెళ్లింది.
ఇక అందుకు అంగీకరించపోవడంతో ఆమె పై ఈ ఆడ ముఠా కక్షగట్టి గర్భిణి అని కూడా చూడకుండా మూకుమ్మడిగా దాడి చేసింది. అంతేకాక ఆమె కేర్టేకర్లపై కూడా దాడికి పాల్పడ్డారు ముఠా సభ్యులు. దీంతో అనుకోకుండా జరగరానిది జరిగిపోయింది. సరోగసీ మదర్ కడుపులో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలింది. తీవ్ర రక్తస్రావం కూడా అవ్వడం మొదలయింది. ఇక వెంటనే ఆమెను కేర్టేకర్లు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గర్భస్రావం అయినట్లు నిర్ధారించారు. డబ్బుల కోసం కడుపులో బిడ్డను సైతం వదలని ఆ లేడీ ముఠా పై కేసు పెట్టారు. సదరు పోలీసులు కేసును నమోదు చేసుకుని. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను బాధితురాలు గుర్తించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మహిళా సంఘం ముసుగులో కమిషన్ల కోసం ముఠా సభ్యులు బెదిరింపులకు పాల్పడినట్లు నిర్ధారించారు.