ఏపీలో వరుస షాకులతో విలవిల్లాడుతోన్న విపక్ష తెలుగుదేశం పార్టీకి మరో అదిరిపోయే షాక్ తగలనుంది. ఈ రోజు మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి టీడీపీలో చేరిపోయారు. ఆయనతో పాటు ఆయన తనయుడు గాదె మధుసూదన్ రెడ్డి కూడా టీడీపీని వీడి వైసీపీలోకి జంప్ చేశారు. ఇక ఇప్పుడు ఈ లిస్టులో మరో కీలక నేత ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేత ఎవరో కాదు ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. గతంలో కాంగ్రెస్ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవి కుమార్ ఆ తర్వాత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఆ తర్వాత తన వ్యాపారాలాను కాపాడుకునే క్రమంలోనే రవికుమార్ టీడీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అద్దంకి నుంచి వరుసగా నాలుగో సారి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక కొద్ది రోజులుగా రవికుమార్ గ్రానైట్ సంస్థలపై దాడులు జరుగుతున్నాయి. ఆయనపై పార్టీ మారాలన్న ఒత్తిడి తీవ్రంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం అద్దంకిలో వైసీపీకి నాయకత్వ సమస్య ఉంది. అక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు.
ఇక ఆయన వయోః భారంతో తప్పుకోవడంతో అక్కడ ప్రస్తుతం ఆయన తనయుడు బాచిన కృష్ణ చైతన్య ఇన్చార్జ్గా ఉన్నారు. రవిని తట్టుకోవాలంటే బాచిన కృష్ణ చైతన్య వల్ల కాదన్న నివేదికలు ఇప్పటికే వైసీపీ అధిష్టానం వద్ద ఉన్నాయి. ఈ నియోజకవర్గం టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ఇక్కడ వైసీపీ జెండా ఎగుర వేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మర మయ్యాయి.
ఇప్పటికే రవి ప్రత్యర్థిగా ఉన్న కరణం బలరాం వైసీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు రవి కూడా పార్టీ మారిపోతే ప్రకాశం జిల్లాలో టీడీపీకి అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నట్లవుతుంది. రవి రెండు మూడు రోజుల్లో జగన్ ని కలిసే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా జరుగుతుంది.